.
జిల్లాలో వానకాలం సీజన్ ధాన్యం సేకరణకు అధికారుల కసరత్తు
195 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
అంచనా.. 2.80 లక్షల మెట్రిక్ టన్నులు
సీఎం కేసీఆర్ నిర్ణయంతో రైతుల హర్షం
జనగామ, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ) : ‘యాసంగిలో మాదిరిగానే ఈవానకాలానికి సంబంధించిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తాం.. రైతుల నుంచి ప్రతి గింజనూ సేకరించాలని నిర్ణయించాం.. పంట చేతికొచ్చిన ప్రాం తాల్లో తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి..’ ఇది సీఎం కేసీఆర్ రైతులకిచ్చిన అభయం. ఈసారి దొడ్డు రకం ధాన్యం కొనుగోలు చేయరని కొద్దిరోజులు ప్రకటనలు వెలువడడంతో రైతుల్లో నెలకొన్న ఆందోళనను తొలగిస్తూ కేసీఆర్ నేనున్నానని అభయమిచ్చారు. దీంతో జిల్లాలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరణ ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేపట్టారు. అంతేకాకుండా గతంలో మాదిరిగా గ్రామాల్లోనే సేకరణ జరిపి నేరుగా రైతు ఖాతాల్లోకే నగదు జమ చేయాలని, డిఫాల్ట్ మిల్లర్లకు ఈసారి ధాన్యం ఇవ్వొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొనుగోళ్ల పరిశీలనకు ప్రత్యేకంగా మానిటరింగ్ సెల్ సహా టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేస్తూ పౌరసరఫరాలశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. దీంతో వానకాలంలో వడ్ల కొనుగోళ్లపై రైతుల్లో ఉన్న అనుమానాలు, అపోహలు, సందిగ్ధతకు తెరపడింది. ఓవైపు రాష్ట్రంలో ఉప్పుడు బియ్యం నిల్వలు పెరిగి గోదాముల్లో పేరుకుపోతుండడంతో ఎగుమతులపై కేంద్రం అనాసక్తి కనబరిచింది. తెలంగాణ నుంచి వచ్చే ఉప్పుడు బియ్యాన్ని రాబోయే యాసంగి నుంచి తీసుకోమని కేంద్రం ప్రకటించడంతో రైతుల్లో ఆందోళన నెలకొన్నది. ఈ నేపధ్యంలో ఈ సీజన్ ధాన్యం సేకరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమైన ప్రకటన ఇవ్వడంతో మునుపటి మాదిరిగానే కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. గత వానకాలంలో వచ్చిన దిగుబడి, సేకరణ ఎంత? ప్రస్తుత సీజన్లో రానున్న దిగుబడి, సేకరణ లక్ష్యంపై జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య ఆదేశంతో సంబంధిత శాఖ అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు.
జిల్లాలో 195 కొనుగోలు కేంద్రాలు..
జిల్లాలోని 12 మండలాల పరిధిలో 195 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గత ఏడాది వానకాలంలో 141 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, యాసంగిలో 195 కేంద్రాల ద్వారా వడ్లు సేకరించారు. గత ఏడాది ఇదే సీజన్లో జిల్లాలో 1,49,087 ఎకరాల్లో వరి సాగు చేయగా, ఈసీజన్లో 1,90,126 ఎకరాల్లో పండిస్తున్నారు. గత ఏడాది కంటే ఈసారి అదనంగా 41,039 ఎకరాల్లో వరి సాగైంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎక్కువ సంఖ్యలో ఉంటేనే మంచిదనే నిర్ణయానికి వచ్చిన అధికారులు గత యాసంగిలో ఎక్కడ్కెడ కేంద్రాలు ఏర్పాటయ్యాయో తిరిగి వాటినే మళ్లీ ఈసీజన్లో ప్రారంభించాలని ఆదేశాలు అందాయి. దీంతో ఈసారి కూడా జిల్లాలో మొత్తం 195 కేంద్రాలకు గానూ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) ఆధ్వర్యంలో 119, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్) ఆధ్వర్యంలో 72 కేంద్రాలు, వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.
2.80 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి..
ప్రస్తుత సీజన్లో జిల్లాలోని 12 మండలాల పరిధిలో 2.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో 50 శాతం అంటే 1.40 లక్షల మెట్రిక్ టన్నులు సన్న ధాన్యం, 1.40 లక్షల మెట్రిక్ టన్నులు దొడ్డు రకం ధాన్యం వస్తుందని భావిస్తున్నారు. అయితే సన్న రకం ధాన్యాన్ని స్థానికంగా కొనుగోలు చేస్తుండగా, ప్రభుత్వరంగ సంస్థలకు 1.40 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు వడ్లు అమ్మకానికి వస్తుందని అధికార యంత్రాంగం భావిస్తున్నది. ధాన్యం సేకరణ, రవాణా, డబ్బుల చెల్లింపుల్లో ఇబ్బందులు లేకుండా చూసేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, పౌరసరఫరాలశాఖ, మార్కెటింగ్శాఖ, సహకార శాఖ, వ్యవసాయశాఖల అధికారులతో కలెక్టర్ శివలింగయ్య, అదనపు కలెక్టర్ భాస్కర్రావు సమీక్షలు నిర్వహించి కొనుగోళ్లపై దిశానిర్ధేశం చేశారు. కేంద్రాల ఏర్పాటు సహా రవాణా, గన్నీ సంచులు అందుబాటులో ఉంచడం, సేకరణ కేంద్రాల వద్ద సౌకర్యాలు, డబ్బుల చెల్లింపు వంటి అంశాలపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
వారం రోజుల్లో కేంద్రాల ఏర్పాటు..
వానకాలం కొనుగోళ్లకు సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వారం రోజుల్లో ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. తొలుత దీపావళి వరకు కేంద్రాలు ప్రారంభించాలని భావించినా జిల్లాలో ఇప్పటికే చాలా చోట్ల వరి కోతలు ప్రారంభమయ్యాయి. కొద్దిరోజులుగా ఎరగాలు ధాన్యం సహా వానకాలం సీజన్లో బావుల కింద ముందస్తుగా పండించిన ధాన్యం జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డుకు పొటెత్తుతున్నది. దసరా తర్వాత సగటున రోజుకు సుమారు 25 వేల బస్తాల ధాన్యం వస్తుందని అంచనా. రైతుల నుంచి దళారులు, వ్యాపారులు ఎరగాలు ధాన్యాన్ని రూ.1350 నుంచి రూ.1400 చెల్లించి ఇప్పటికే కొనుగోలు చేసి గోదాముల్లో నిల్వ చేసుకున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరిచిన వెంటనే బినామీ రైతుల పేరిట ఇదే ధాన్యాన్ని రూ.1960కి అమ్మి సొమ్ము చేసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవకముందే ఇప్పటి వరకు మార్కెట్కు వచ్చిన ఎరగాలు, వానకాలం సీజన్లో వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేసిన నిల్వలను అధికారులు తనిఖీ చేసి దిగుమతి, ఎగుమతి నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని రైతులు అభిప్రాయపడుతున్నారు.