వెంకటాపూర్, ఆగస్టు 21 : తుఫాన్లు, వరదలు, నీటి ప్రమాదాలు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఆర్వో కే రమాదేవి సూచించారు. కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య ఆదేశాల మేరకు వరదలు వచ్చినప్పుడు ప్రజలను ఎలా రక్షంచాలనే అంశంపై ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప సరస్సులో ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. సుమారు 3 గంటల పాటు నిర్వహించిన డ్రిల్లో పలు అంశాలను ఫోర్స్ సభ్యులు కళ్లకు కట్టినట్లు చేసి చూపించారు. వరదలో చిక్కుకున్న వారిని తాడు సహాయంతో ఎలా రక్షించాలి, నీటిలో గల్లంతైన వారిని ఎలా వెతకాలి అనే అంశాలను ప్రదర్శించారు. వరదలలో కొట్టుకుపోయి చెట్లకు చిక్కుకున్న వారిని బోట్లు వెళ్లలేని చోటుకు తాడు సహాయంతో వెళ్లి ఎన్డీఆర్ఎఫ్ బృందం ఎలా రక్షిస్తుందో చూపించారు. చెరువులో పడి స్పృహ కోల్పోయిన వారిని ఎలా రక్షించాలి, లైఫ్ జాకెట్స్ లేని చోట ఖాళీ టిన్నులు, నూనె డబ్బాలు, వాటర్ బాటిల్స్ సహాయంతో ఒడ్డుకు ఎలా చేరాలో స్థానికులకు వివరించారు. కార్యక్రమంలో ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్ జహీర్ఖాన్, రెవెన్యూ, వైద్య, జీపీ కార్యదర్శులు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, సివిల్ సప్లయ్, ఫిషరీస్, ఆర్డబ్ల్యూఎస్, ఫైర్, ములుగు, ఏటూరునాగారం, వెంకటాపురం సీఐలు శ్రీధర్, కిరణ్కుమార్, శివ ప్రసాద్, ఎంపీపీ బుర్ర రజిత, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.