కొడకండ్ల, అక్టోబర్ 20 : గోదావరి జలాలతో బీడు భూములు సస్యశ్యామలమవుతున్నాయి. ఎస్సారెస్పీ రెండో దశలో కాకతీయ కాల్వ ద్వారా నీటి సరఫరా అవుతుండడంతో బయ్యన్నవాగు రిజర్వాయర్ కళకళలాడుతున్నది. దీంతో ఉప కాల్వల ద్వారా జనగామ, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో 2.15 లక్షల ఎకరాలకు సాగునీరందుతున్నది. సమైక్య పాలనలో కాల్వల నిర్మాణం పూర్తికాక సాగు భూములు సైతం బీడుగా మారాయి. పోరాడి సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషి ఫలితంగా గోదావరి జలాలు ప్రతి ఎకరాకు పారుతున్నాయి. మూడు జిల్లాల పరిధిలోని 850 చెరువులు, కుంటలను నింపుతుండగా జిల్లాలోని కొడకండ్ల, మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర, దంతాలపల్లి మండలాలతోపాటు సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, నాగారం, అర్వపల్లి, మద్దిరాల, సూర్యాపేట, చివ్వెంల, కోదాడ మండలాలకు పుష్కలంగా సాగునీరందుతున్నది.
ఎస్పారెస్పీ రెండో దశలో కాకతీయ కాల్వ ద్వారా గోదావరి జలాలు వస్తుండడంతో మండల కేంద్రంలోని బయ్యన్నవాగు రిజర్వాయర్ కళకళలాడుతున్నది. స్వరాష్ట్రం వచ్చాకే కాల్వల నిర్మాణం పూర్తికావడంతో పంటపొలాలకు నీరందుతున్నది. బయ్యన్నవాగు రిజర్వాయర్ నుంచి కాల్వల ద్వారా మండలంలోని నర్సింగాపురం, రంగాపురం గ్రామాల్లో 205 ఎకరాలకు సాగునీరందుతున్నది. రిజర్వాయర్ మత్తడి పడినప్పుడు బయ్యన్నవాగు నుంచి గోదావరి జలాలు ఆకేరు ద్వారా మహబూబాబాద్ జిల్లా పెద్ద ముప్పారం చెరువు వరకు నీరందుతుంది. కొడకండ్ల శివారు వెలిశాల వద్ద డీబీఎం-69 కాల్వ నుంచి వెళ్లే నీటితో సూర్యాపేట జిల్లాలోని సుమారు 500కు పైగా చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. డీబీఎం 69, 70, 71 కాల్వల నుంచి ఈ సంవత్సరం 10.5 టీఎంసీల నీటిని విడుదల చేశారు. తుంగతుర్తి, నాగారం, అర్వపల్లి, మద్దిరాల, సుర్యాపేట, చివ్వెంల, కోదాడ మండలాల్లో వానకాలం, యాసంగి సాగుకు పుష్కలంగా సాగునీరందుతున్నది.
వేసవిలోనూ పుష్కలంగా జలాలు..
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2016లో తీవ్ర వర్షాభావం నెలకొన్నప్పుడు పంటలను కాపాడేందుకు 42 రోజులపాటు ఎస్పారెస్పీ ద్వారా గోదావరి జలాలు విడుదల చేశారు. అనంతరం 2018 అక్టోబర్ 5 నుంచి 20 రోజుల పాటు నీటిని విడుదల చేసి 100కుపైగా చెరువులను నింపి పంటలు కాపాడారు. తిరిగి 2019 అక్టోబర్ 20న కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి జాలాలు 100 రోజులకు పైగా విడుదల చేశారు. ఆ సమయంలో బయ్యన్నవాగు రిజర్వాయర్ నీటిని విడుదల చేయడంతో సూర్యాపేట జిల్లాలోని చెరువు, కుంటలు నిండాయి. 2020 జూలై 19న వానకాలం పంట చేతికందే వరకు సాగునీరందించారు. ఈ సంవత్సరం నుంచి మరిన్ని జలాలు వస్తుండడంతో వానకాలం, యాసంగి పంటలకు ఢోకాలేదు.
నిండుకుండలా బయ్యన్నవాగు రిజర్వాయర్
బయ్యన్నవాగు రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నిండి మొన్నటి వరకు అలుగుపోసింది. వరంగల్ జిల్లా వర్దన్నపేట వద్ద ప్రారంభమయ్యే ఎస్సారెస్పీ కాకతీయ కాల్వ ద్వారా బయ్యన్నవాగు రిజర్వాయర్కు నీరందుతుంది. వెలిశాల శివారు నుంచి డీబీఎం 69 కాల్వ ద్వారా సూర్యాపేట జిల్లా నాగారం వరకు 8 కిలోమీటర్ల మేరకు ప్రధాన కాల్వ ఉంది.
సాగునీటి రంగంలో నూతన శకం
డీబీఎం 69, 70, 71 ఉప కాల్వల ద్వారా 2,21,609 ఎకరాలు సాగులోకి రావడం రికార్డని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కాల్వల పనులు పూర్తి కావడంతో చెరువులు, కుంటలకు గోదావరి జలాలు అందుతున్నాయి. దీంతో దశాబ్దాల కరువు సమస్య పరిష్కారమైందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బయ్యన్నవాగు రిజర్వాయర్తో పరిసరాలు ఆహ్లాదకరంగా మారినందున ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దాలని ఈ ప్రాంత ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.