హ్యూస్టన్: వినువీధిలో తెలుగు కీర్తి పతాకం రెపరెపలాడబోతున్నది. అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ‘వర్జిన్ గెలాక్టిక్’ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘వీఎస్ఎస్ యూనిటీ-22’ అనే మానవసహిత వ్యోమనౌకను రోదసీలోకి ఆదివారం పంపిస్తున్నది. ఇందులో ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన శిరీష బండ్ల ప్రయాణించనున్నారు. వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలిస్తే న్యూ మెక్సికో నుంచి ఆదివారం ఉదయం 9 గంటలకు (అమెరికా కాలమానం) ‘వీఎస్ఎస్ యూనిటీ–22’ అంతరిక్షంలోకి దూసుకుపోనున్నది. వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాస్నన్, శిరీషతోపాటు మరో నలుగురు హ్యోమగాములు ఈ స్పేస్ క్రాఫ్ట్లో వెళ్లనున్నారు. భూమి నుంచి 15 వేల మీటర్ల ఎత్తుకు వీఎంఎస్ ఈవ్ ప్రత్యేక విమానం వెళ్లనుంది. అందులోనే వ్యోమనౌక వీఎస్ఎస్ యూనిటీ-22 ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో జన్మించిన శిరీష.. తల్లిదండ్రులతో హ్యూస్టన్లో స్థిరపడ్డారు. అక్కడే విద్యనభ్యసించి ఏరోనాటికల్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. వర్జిన్ గెలాక్టిక్లో ఈ ఏడాది జనవరి నుంచి ప్రభుత్వ వ్యవహారాలు-పరిశోధన కార్యకలాపాల విభాగానికి ఆమె ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా, ఈ ప్రయాణంలో భాగస్వామ్యం కావడం తనకెంతో సంతోషంగా ఉందని శిరీష ట్విటర్లో పేర్కొన్నారు. అంతరిక్షయానాన్ని అందరికీ అందుబాటులోకి తేవడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. కల్పన చావ్లా, సునీత విలియమ్స్ తర్వాత రోదసిలోకి ప్రయాణించనున్న మూడో భారతీయ మహిళగా శిరీష నిలవనున్నారు.