కడెం, జూలై 10 : నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్లో 2011 జనాభా లెక్కల ప్రకారం 3,485 మంది, 1,332 నివాసగృహాలు, 2,293 మంది ఓటర్లు ఉన్నారు. ఏడాదికి రూ. 46 లక్షల నిధులు వస్తున్నాయి. ఇందులో నుంచి పంచాయతీ పారిశుధ్య కార్మికులకు ఏడాదికి రూ.7.14 లక్షలు చెల్లిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ పంచాయతీకి రూ.1.16 కోట్లు రాగా.. ఈ నిధులతో వివిధ పనులు చేపట్టారు. రూ.12.50 లక్షలతో వైకుంఠధామాన్ని నిర్మించారు. 2.40 లక్షలతో సేం ద్రియ ఎరువుల తయారీ షెడ్డు (సెగ్రిగేషన్) నిర్మాణం, పంచాయతీ నిధు ల ద్వారా రూ.50 లక్షలతో సీసీ రోడ్లు, రూ.15 లక్షలతో డ్రైనేజీలు, ఆర్అండ్బీ నిధుల ద్వారా రూ.80 లక్షలతో సీసీ రోడ్లు, ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా రూ.కోటితో రోడ్డుతోపాటు, రోడ్లకు మొరం పనులు పూర్తి చేశారు. రైతువేదిక, రెండు పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. పంచాయతీ ట్రాక్టర్తోపాటు, ట్యాంకర్, ట్రాలీ అందుబాటులోకి రావడంతో చెత్త సేకరిస్తున్నారు. చెత్తను సెగ్రిగేషన్ షెడ్డుకు తరలించడంతోపాటు, దానిని తడి, పొడిచెత్తగా వేరు చేసి ఎరువుగా తయారు చేస్తున్నారు. ఇటీవల దాదాపు రూ. 10 వేల వరకు ఎరువును పలువురు రైతులకు విక్రయించారు. ఏడుగురు పంచాయతీ కార్మికులతో నిత్యం రోడ్లను శుభ్రం చేయించడంతో పా టు, పల్లెప్రకృతి వనాల రక్షణ, డ్రైనేజీల పూడికతీత, తదితర పనులు చే యిస్తూ గ్రామ పంచాయతీని శుభ్రంగా ఉంచుతున్నారు.
పల్లె ప్రగతితో మారిన పంచాయతీ
మూడు విడుతలుగా నిర్వహించిన పల్లె ప్రగతిలో రోడ్లపై గుంతలు పూడ్చడం, పాడుబడ్డ, కూలిపోయిన నిర్మాణాలు తొలగించడం, వ్యర్థాలు లేకుండా చర్యలు తీసుకోవడం, చెత్త సేకరణ చేపట్టడం, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాలు, మార్కెట్ స్థలాల వంటి ప్రజా ప్రయోజనాల సంస్థలన్నింటినీ శుభ్రపర్చారు. నీరు నిల్వ లేకుండా చూశారు. పిచ్చిమొక్కలు తొలగించారు. ఈజీఎస్, గ్రామ పంచాయతీ నుంచి ఇప్పటి వరకు దాదాపు 20 వేలకు పైగా మొక్కలు నాటారు. అలాగే దోమల నివారణకు మురుగు నీరు తొలగించడం, రసాయనాలు చల్లడం, క్లోరినేషన్ చేయించడం, పైప్లైన్, లీకేజీలకు మరమ్మతులు చేశారు. విద్యుత్ పనుల్లో భాగంగా విరిగిన, వంగిన విద్యుత్ స్తంభాలను తొలగించి వాటి స్థానాల్లో నూతన స్తంభాలను ఏర్పాటు చేయించారు. వీధి దీపాల కోసం థర్డ్ లైన్ ఏర్పాటు చేశారు.
గతంతో పోల్చితే ఇబ్బందులు తీరినయ్..
గతంలో లింగాపూర్ గ్రామ పంచాయతీ సమస్యలకు కేరాఫ్గా ఉండేది. ఎక్కడి సమస్యలు అక్కడే గ్రామాన్ని పట్టించుకునేవారే కరువయ్యారు. మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితి ఉండేది. సమస్యలు తీర్చేవారే లేక ప్రజలంతా ఇబ్బందులు పడ్డారు. 2018 ఎన్నికల అనంతరం మా గ్రామ రూపురేఖలు మారిపోయినయ్. రాష్ట్ర ప్రభుత్వం అందించిన నిధుల ద్వారా గ్రామంలో అనేక అభివృద్ధి పనులు పూర్తి చేశారు. గతంతో పోల్చితే నేడు లింగాపూర్ పంచాయతీ అన్నింటిలో మెరుగుపడింది.
గ్రామ ప్రజల సహకారంతోనే అభివృద్ధి
గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాల్లోకి నిధులు జమ చేస్తున్నది. ఈ నిధులతో గ్రామంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం. ప్రజల అవసరాలను గుర్తించి పంచాయతీ పాలకవర్గ సభ్యుల తీర్మానంతో గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టాం. ఇక విడుతలవారీగా పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామంలో ఎంతో అభివృద్ధి జరిగింది. నాలుగో విడుతలో భాగంగా పచ్చదనంపై ప్రత్యేక దృష్టి సారించాం. ఇప్పటికే 20 వేల వరకు మొక్కలు నాటినం. – ఆకుల బాలవ్వ, సర్పంచ్, లింగాపూర్.