సూర్యాపేట, జూన్ 6 (నమస్తే తెలంగాణ) : సమాజంలో అట్టడుగున ఉండి దుర్భరమైన జీవితం గడుపుతున్న వర్గాల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నది. రేషన్ బియ్యం కోటాతో పాటు పింఛన్లు పెంచడం, కుల వృత్తులకు ప్రోత్సాహకాలు అందించడం వంటివి చేస్తున్నది. ఈ వర్గాల్లోని నిరుద్యోగులకు ఎస్సీ కార్పొరేషన్ నుంచి 80 శాతం సబ్సిడీతో రుణాలు అందిస్తున్నది. ప్రస్తుతం నిరుపేద దళిత కుటుంబానికి రూ.10లక్షలు ఇవ్వాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం దళిత సాధికారత పథకం తీసుకొచ్చారు. దీంతో పాటు దళిల వాడల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు.
దళిత వాడల్లో సర్వే
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలోని దళిత వాడల్లో మున్సిపల్ అధికారులు, ఆయా వార్డుల కౌన్సిలర్లు పర్యటించి సమస్యలను గుర్తిస్తున్నారు. ఆయా కాలనీల వారితో సమావేశమై వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. సూర్యాపేట పట్టణంతో పాటు విలీన గ్రామాలైన రాయనిగూడెం, పిల్లలమర్రి, కుడకుడ, కోమటికుంట, దురాజ్పల్లి, హుజూర్నగర్, కోదాడ పట్టణంతో పాటు తమ్మర, అల్వాల్పురం, నేరేడుచర్ల పట్టణంతో పాటు రామాపురం, నర్సయ్యగూడెం, తిరుమలగిరి, దాని విలీన గ్రామాలైన నందాపురం, అనంతారం, మాలిపురంలోని ఎస్సీ వార్డులల్లో అధికారులు పర్యటిస్తున్నారు.
అవసరాల గుర్తింపు
ప్రస్తుతం పట్టణ ప్రగతిలో భాగంగా మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు, కౌన్సిలర్లు దళిత వాడల్లో పర్యటిస్తున్నారు. ఆయా వార్డుల్లో ప్రస్తుత పరిస్థితిని అంచనా వేస్తూ.. రోడ్లు, మురుగు కాల్వలు, విద్యుత్ లైన్లు, తాగునీటి వనరులు, వ్యక్తిగత మరుగుదొడ్లు, వైకుంఠ ధామాలు, పార్కులు, కమ్యూనిటీ హాల్స్ ఇలా అవసరమైన వసతులను వాటిని గుర్తిస్తున్నారు. ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటున్నారు. వీటి నిర్మాణానికి సంబంధించిన ఎస్టిమేషన్ రూపొందిస్తున్నారు.
ప్రభుత్వ ఆదేశాలతో సర్వే
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీల్లోని దళిత వాడల్లో సమస్యలు గుర్తించాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సర్వే చేస్తున్నాం. సీఎం దళిత్ ఎంపవర్మెంట్ స్కీం నిధులతో ఎస్సీ వార్డుల్లో సదుపాయాల కల్పనకు అవసరమైన ప్రపోజల్స్ ప్రభుత్వానికి పంపించాల్సి ఉంది. అందుకే అవసరమైన వాటిని గుర్తిస్తున్నాం.
-రామానుజులరెడ్డి, మున్సిపల్ కమిషనర్, సూర్యాపేట