రంగారెడ్డి, జూలై 5, (నమస్తే తెలంగాణ): 57 ఏండ్లు నిండిన అర్హులైన వారికి త్వరలో పింఛన్ల పింపిణీకి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం సిరిసిల్ల పర్యటనలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టతనిచ్చారు. పింఛన్కు అర్హుల వయసు పరిమితిని 65 నుంచి 57 ఏండ్లకు తగ్గిస్తామని ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రెండేండ్ల క్రితమే జిల్లాలో 57 నుంచి 64 ఏండ్ల మధ్య వయస్సు వారి వివరాలను ఓటరు జాబితా ప్రకారం జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సేకరించారు. జిల్లావ్యాప్తంగా 57నుంచి 64 ఏండ్ల వయస్సుగల వారు 1,72,052 మంది ఉన్నట్లు గుర్తించింది. వీరిలో 31,947 మంది ఆసరా పింఛన్లకు అర్హులుగా సంబంధిత అధికారులు లెక్క తేల్చారు. మళ్లీ సర్వే నిర్వహించి అర్హులను గుర్తించనున్నారు. ప్రతి పంచాయతీలో మరోసారి గ్రామసభ నిర్వహించి అర్హులను ఎంపిక చేయనున్నారు. ఈనెలాఖరులోగా అర్హుల జాబితా సిద్ధం చేసేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కసరత్తులు మొదలుపెట్టారు. పింఛన్లకు సంబంధించి అర్హులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం పలు నిబంధనలు విధించింది. జిల్లాలో ప్రస్తుతం 1,64,5724 ఆసరా పింఛన్లు ఉన్నాయి. ఇందులో వృద్ధాప్య పింఛన్లు 53,381, వితంతువు 76,503 పింఛన్లు, దివ్యాంగులు 26,120 పింఛన్లు, గీతా కార్మికులు 757 పింఛన్లు, చేనేత కార్మికులు 2,017 పింఛన్లు, ఒంటరి మహిళలు 5,930 మంది పింఛన్లు, బీడీ కార్మికులు 16 మంది పింఛన్దారులు ఉన్నారు. జిల్లావ్యాప్తంగా ఆసరా పింఛన్ల నిమిత్తం ప్రభుత్వం ప్రతి నెలా రూ.18 కోట్లను ఖర్చు చేస్తున్నది.
జిల్లాలో 31,947 మంది అర్హులు
ఆసరా పింఛన్ లబ్ధిదారుల వయసు పరిమితిని 65 నుంచి 57 ఏండ్లకు తగ్గిస్తామని 2018 సార్వత్రిక ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని అమలుచేసేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. 2019 నవంబర్ నాటికి ఓటరు కార్డుల ద్వారా వివరాలు సేకరించగా, జిల్లాలో 1,72,052 మంది ఉన్నట్లు గుర్తించారు. వీరిలో 31,947 మంది ఎలాంటి పింఛన్లు పొందడం లేదని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులని లెక్కతేల్చారు.
నియోజకవర్గాల వారీగా..
చేవెళ్ల నియోజక వర్గంలో చేవెళ్ల మండలంలో 1,173, మొయినాబాద్ 864, షాబాద్ 1,395, శంకర్పల్లి 1,003, శంకర్పల్లి మున్సిపాలిటీలో 316, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 6,007 మంది, కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్లులో 224, కడ్తాల్లో 316, తలకొండపల్లిలో 924, మాడ్గులలో 1040, ఎల్బీనగర్ సర్కిల్ పరిధిలో 2,692, మహేశ్వరం నియోజకవర్గంలో 4,948, రాజేంద్రనగర్ నియోజకవర్గంలో 4,004, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 1,284, షాద్నగర్ నియోజకవర్గంలో 5,569 మంది 57 ఏండ్లు నిండిన వారు ఉన్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు లెక్క తేల్చారు.