కెనడాలోని పాతకాలం నాటి స్కూళ్ల వద్ద గత కొన్నిరోజులుగా బయటపడుతున్న చిన్న పిల్లల అస్తిపంజరాలు పాశ్చాత్య ప్రపంచాన్ని కుదిపివేస్తున్నాయి. ఈ నమ్మలేని దారుణాలు మన మీడియాకు ఎందువల్లనో ఎక్కలేదుగానీ.. ఏడాది క్రితం అమెరికాలో జరిగిన జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతం తర్వాత ఇప్పుడిది తిరిగి కల్లోలాన్ని సృష్టిస్తున్నది. ఫ్లాయిడ్ నల్లజాతి అమెరికన్ కాగా, ఈ పిల్లలు కెనడాలోని ఆదిమ జాతుల వారు. చదివిస్తామని చెప్పి యూరోపియన్లకు చెందిన చర్చి స్కూళ్లు ఆ పిల్లలను వారి కుటుంబాల నుంచి బలవంతంగా లాక్కొచ్చాయి. ఇదంతా 19-20 శతాబ్దాలలో జరిగిన విషయం. ఇప్పుడు ఆ పిల్లల అస్తిపంజరాలు తవ్వినాకొద్దీ వెలికివస్తున్నాయి.
ఈ నిర్బంధ, వెట్టిచాకిరీ, హింసల మధ్య ఏమి జరిగిందో ఇప్పటివరకూ బయటపడలేదుగానీ వేలాది మంది పిల్లల (వారిలో అయిదేండ్లలోపు వారు కూడా ఉన్నారు) ప్రాణాలు తీసి పాతిపెట్టారు. ఈ విధంగా సామ్రాజ్యవాదానికి చిన్న పిల్లలు కూడా మినహాయింపు కాలేదు.
ఈవార్తలు ఇక్కడ రానందున మొదట విషయం చెప్పుకొని తర్వాత చర్చలోకి వెళ్దాము. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రాంతంలో గల స్కూళ్ల వద్ద గత నెలలో ఎవరి పేర్లూ లేని సమాధులు బయటపడ్డాయి. పాశ్చాత్య దేశాలలో సమాధుల వద్ద సదరు వ్యక్తుల పేర్లతో ఫలకాలుంటాయి. కానీ అవి లేకపోవటంతో ఆ ప్రాంతంలో నివసించే ‘కొవెస్సెస్ ఫస్ట్ నేషన్’ తెగ పెద్దలు రాడార్లతో అన్వేషణ జరిపించారు. దానితో అవి వారి తెగకు చెందిన చిన్న పిల్లలవి అని తేలింది. ఆ విధంగా జూన్ 24 నుంచి జూలై 2 మధ్య మూడు స్కూళ్ల వద్ద మొత్తం 600కు పైగా అస్తిపంజరాలు బయటపడ్డాయి. ‘ఇండియన్ రెసిడెన్షియల్ స్కూల్స్ అగ్రిమెంట్’ ప్రకారం 19-20వ శతాబ్దాలలో మొత్తం 139 స్కూళ్లు నడిచాయి. ఈ పాఠశాలలకు అమెరికా మూలవాసులైన రెడ్ఇండియన్ల పిల్లలను బలవంతంగా తరలించారు. ప్రస్తుతం అస్తిపంజరాలు బయటపడిన నేపథ్యంలో.. మొత్తం 139 స్కూళ్ల వద్ద రాడార్లతో శోధింపజేస్తామని కొవెస్సెస్ తెగ రెడ్ ఇండియన్ పెద్దలు ప్రకటించారు.
ఒక అంచనా ప్రకారం కెనడా ప్రభుత్వం, రోమన్ కేథలిక్ చర్చి కలిసి ఆ కాలమంతా సుమారు లక్షన్నర మంది రెడ్ ఇండియన్ తెగల పిల్లలను వారి కుటుంబాల నుంచి బలవంతంగా వేరుచేసి తెచ్చి చర్చి స్కూళ్లలో పెట్టారు. వారిలో ఇట్లా ఏ గుర్తింపు లేకుండా చనిపోయి సమాధి అయినవారు 10 వేల మంది వరకు ఉంటారని రెడ్ ఇండియన్లలోని వివిధ తెగల పెద్దలు ఇప్పుడు అంచనా వేస్తున్నారు. రాడార్ సర్వేలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ చర్చి స్కూళ్లు ప్రస్తుతం పనిచేయటం లేదుగాని, 19వ శతాబ్దం నుంచి మొదలుకొని 20వ శతాబ్దం చివరి వరకు పనిచేశాయి. దీనిలో మరింత దిగ్భ్రాంతిని కలిగించేదేమంటే ఈ దారుణాలు కెనడా ప్రభుత్వానికి, చర్చి పెద్దలకు మొదటినుంచి తెలిసినప్పటికీ వాటిని ఆపకపోగా బుద్ధిపూర్వకంగా కొనసాగించినట్లు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నది. ఇందుకు కెనడా ప్రధాని ట్రూడో అయితే క్షమాపణలు చెప్పారుగాని ఆ పని చేసేందుకు పోప్ నిరాకరించటం గమనించదగ్గది.
ఇంతకూ ఈ దారుణాలు ఎందుకు జరిగాయన్నది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. యూరోపియన్లు ప్రస్తుత అమెరికా, కెనడా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాలలో, ఖండాలలో అడుగిడినప్పుడు ఆరు లక్ష్యాలు పెట్టుకున్నారు. యూరోపియనల్ వలస చరిత్రలు, సామ్యవాద చరిత్రలు చదివినవారికి ఇవి తెలిసిన విషయాలే. వారి ఆరు లక్ష్యాలు.. అక్కడి వనరుల దోపిడీ, అక్కడి భూముల ఆక్రమణ, మనుషుల శ్రమ దోపిడీ, అవసరమైన మేర అక్కడి తెగలను భౌతికంగా నిర్మూలించటం, తెగలను, స్థానిక ప్రజలను క్రైస్తవంలోకి మత మార్పిడి చేయించటం, అస్సిమిలేషన్ (తమలో కలుపుకోవటం) పేరిట అక్కడి ప్రజల భాషా సంస్కృతులను, కుటుంబ వ్యవస్థలను చివరికి తెగలనే ధ్వంసం చేయటం. ఇవి వారి లక్ష్యాలు.
కెనడాలోని ప్రస్తుత ఉదంతం వెనుక ఈ చారిత్రక నేపథ్యమంతా ఉంది. యూరప్ నుంచి వలసవెళ్లి స్థానిక తెగల భూములను ఆయుధ బలంతో ఆక్రమించుకున్నారు. అస్సిమిలేషన్ విధానాన్ని బాహాటంగా ప్రకటించి ఆ తెగల పిల్లలను బలవంతంగా తెచ్చి చర్చి స్కూళ్లలో చేర్చారు. వారిని మత మార్పిడి చేశారు. ఆ స్కూళ్లలో ఆ పిల్లల మాతృభాషలను నిషేధించారు. సొంతభాషలో మాట్లాడితే పిల్లలను దారుణంగా హింసించేవారు. ఒకసారి ఆ స్కూల్కు వచ్చిన తర్వాత ఇక ఆ చిన్నారులు వారి తల్లిదండ్రులను కలుసుకోవటానికి లేదు. వారి స్వస్థలాలకు వెళ్లటానికి లేదు. వారి భాషలో మాట్లాడుకోవటానికి లేదు. ఇంతటి దారుణ నిర్భందంలో ఉన్న ఆ పిల్లలపై ఆ స్కూళ్లలో లైంగికదాడులు సర్వసాధారణంగా జరిగేవి. ఆ పిల్లల పోషణ, ఆరోగ్యాన్ని పట్టించుకునేవాళ్లు కాదు.
అస్సిమిలేషన్ తీరు ఇది కాగా, తెగలను భౌతికంగా నిర్మూలించటం కోసం యూరోపియన్లు సామూహిక హత్యాకాండలు సాగించారు. మశూచి, ప్లేగు వంటి వ్యాధుల క్రిములను తెగల్లో ఉద్దేశపూర్వకంగా వ్యాపింపజేసేవారు. ఆ వ్యాధులకు గతంలో లోనైన చరిత్ర లేకపోవటం వల్ల స్థానిక రెడ్ఇండియన్ల శరీరాల్లో ఆ క్రిములను ఎదుర్కొనే రోగనిరోధకశక్తి ఉండేది కాదు. దీంతో సూక్ష్మక్రిములు సోకగానే కొన్ని నెలల వ్యవధిలోనే వందలు, వేల సంఖ్యలో మరణించేవారు. ఏకంగా తెగలే నిర్మూలన అయ్యేవంటే.. యూరోపియన్ల దుర్మార్గపు హత్యాకాండ ఏ స్థాయిలో జరిగిందో అర్థంచేసుకోవచ్చు. రెడ్ఇండియన్ తెగల్లో ఏ పద్ధతులలో సూక్ష్మక్రిములను వ్యాపింపజేశారు అన్నదానిపై పరిశోధనా పత్రాలు, ప్రసంగాలు ప్రస్తుత కరోనా సందర్భంగా పాశ్చాత్య జర్నల్స్ ద్వారానే వెలికి వస్తున్నాయి. ఈ ఏడాది పులిట్జర్ పురస్కారం పొందిన నవల ‘ద నైట్ వాచ్మన్’లోని ఇతివృత్తం.. అమెరికాలో రెడ్ ఇండియన్లపై సైన్యం-చర్చి కుమ్మక్కయి జరిపిన దారుణ దోపిడీ, హత్యాకాండలను చర్చించినదే. మశూచి సోకినవారు కప్పుకున్న దుప్పట్లు, బ్లాంకెట్లను తీసుకొని స్థానిక తెగలకు పంచేవారని, తద్వారా ఆ తెగల్లో మశూచిని వ్యాపింపజేసేవారని ఈ నవలలో వెల్లడించారు. ఈ నవల రచయిత్రి లూయీ ఎర్డ్రిచ్ స్వ యంగా రెడ్ ఇండియన్.
కెనడాలో పిల్లల అస్తిపంజరాలు బయటపడుతున్న ఉదంతంతో ప్రస్తుతం తీవ్రమైన నిరసనలు, ప్రదర్శనలు, బ్రిటిష్ రాణుల విగ్రహ విధ్వంసాలు, చర్చిలపై దాడులు, ప్రభుత్వ పెద్దల క్షమాపణలు సాగుతున్నాయి. రానున్న రోజులలో ఇంకా ఏమి జరుగనున్నదో చూడవలసి ఉంది.
టంకశాల అశోక్