పెద్దపల్లి, జూలై 3(నమస్తే తెలంగాణ): జిల్లాలోని జలాశయాల్లో చేపపిల్లలను వదిలేందుకు మత్స్య శాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇందుకు గానూ 2021-22కి సంబంధించి జిల్లాలోని అన్ని పెద్ద, చిన్న చెరువుల్లో మొత్తంగా చేప పిల్లలను వదిలేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని చేప పిల్లల పంపిణీకి ఎలాంటి ఆలస్యం జరగకుండా వర్షాలు సమృద్ధిగా కురవకపోయినా నిండిన చెరువుల్లో చేప పిల్లలను వదిలేందుకు టెండర్ల ప్రక్రియను ప్రారంభించారు. మత్స్యకారులపై ఆర్థిక భారం పడకుండా చేప పిల్లలను చెరువులు నిండిన వెంటనే పంపిణీ చేసే ప్రక్రియను మొదలు పెట్టారు. గతేడాది జిల్లాలో మత్స్యశాఖ పరిధిలోని 188 చెరువులు, పంచాయతీల పరిధిలోని 880 చెరువులు, కుంటలు, సరస్వతి, పార్వతి బరాజ్లు, ఎల్లంపల్లి జలాశయాల్లో ఏకంగా కోటీ 53లక్షల 78వేల 918 చేప పిల్లలను పంపిణీ చేయగా ఈ ఏడాది అదే పద్ధతిలో చేప పిల్లలను పోసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షాలు పుష్కలంగా కురవకపోయినా తక్కువగా కురిస్తే మాత్రం వీటి సంఖ్యలో తేడాలు ఉండే అవకాశం ఉంది.
గతేడాది మత్స్యకారులకు రూ. 60 కోట్ల ఆదాయం..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న చేప పిల్లల పంపిణీ కార్యక్రమం కారణంగా జిల్లాలోని మత్స్యకారులకు రూ. 60కోట్ల అదనపు ఆదాయం లభించింది. 2019-20మత్స్య ప్రణాళిక ప్రకారం జిల్లాలోని 1013 చెరువులు, కుంటలు, రిజర్వాయర్లో 151.41లక్షల చేప పిల్లలను పంపిణీ చేయగా సగటున 7240 టన్నుల చేపల ఉత్పత్తి జరిగింది. దీంతో 60కోట్ల ఆదాయం మత్స్యకారులకు లభించింది. జిల్లాలోని 161మత్స్య సహకార సంఘాలు ఉండగా వీటిలో 9975మంది సభ్యులు ఉన్నారు. సరస్వతి, పార్వతి బరాజ్, ఎల్లంపల్లి జలాశయంలో 19లక్షల రొయ్యపిల్లలను వదలగా దీనికి గాను 38టన్నుల రొయ్యల దిగుబడి లభించింది. మత్స్యకారులకు మరింత ప్రయోజనాన్ని చేకూర్చేందుకు పెద్ద ఎత్తున ప్రణాళికలను మత్స్యశాఖ సిద్ధం చేసి గతేడాది రూ. 123.55కోట్లతో 1049 చెరువులు, కుంటల్లో 151.34లక్షల చేప పిల్లలను వదిలింది. దీంతో గతేడాది 4237.42 టన్నుల చేపలు చేతికందాయి. దీంతో మత్స్యకారులకు రూ. 60కోట్ల వరకు ఆదాయం లభించిందని మత్స్యశాఖ అధికారులు తెలిపారు.
జలాశయాల్లో 38.50లక్షల చేపలు, 19 లక్షల రొయ్యలు
తెలంగాణ ప్రభుత్వం తెలంగాణకు జీవనాడిగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పెద్దపల్లి జిల్లా మత్స్యకారులకు వరంగా మారనుంది. జిల్లాలో 111కిలో మీటర్ల దూరం వరకూ విస్తరించి ఉండే గోదావరినదిపై నిర్మించిన సరస్వతి, పార్వతి బరాజ్, ఎల్లంపల్లి, నందిమేడారం రిజర్వాయర్లలో 38.50లక్షల చేప పిల్లలు, 19లక్షల రొయ్యపిల్లలను వదలనున్నారు. వీటిలో బొచ్చె, రాహు, కట్ల రకాలను వదలనున్నారు. గోదావరికి దిగువన జయశంకర్ భూపాలపల్లి జిల్లా అన్నారం వద్ద10.87టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన సరస్వతి బరాజ్ బ్యాక్ వాటర్ ఏరియా అంతా పెద్దపల్లి జిల్లాలో విస్తరించి ఉండడంతో అందులో 8.79లక్షల చేప పిల్లలు, 4లక్షల రొయ్య పిల్లలు, దానికి ఎగువన మంథని మండలం సిరిపురం వద్ద 8.8టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన పార్వతి బరాజ్లో 11.41లక్షల చేప పిల్లలు, 4లక్షల రొయ్య పిల్లలు, 20.17టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల రామగుండం మండలం ఎల్లంపల్లిలో 12.21లక్షల చేప పిల్లలు, 4లక్షల రొయ్య పిల్లలు, ధర్మారం మండలం నంది మేడారం రిజర్వాయర్లో 6.09లక్షల చేప పిల్లలను వదలనున్నారు. .
1068 చెరువుల్లో చేప పిల్లల పంపిణీ..
జిల్లాలో మత్స్య శాఖ పరిధిలోని 1068 చెరువులు, గ్రామ పంచాయతీల పరిధిలోని కుంటల్లో ప్రభుత్వం నుంచి కోటి 15క్షల చేప విత్తనాలను పంపిణీ చేయనున్నారు. చెరువులు, కుంటల్లో బొచ్చె, రాహు, బంగారు తీగ రకాలను పంపిణీ చేయనున్నారు. గతేడాది ఆగస్టు నెల నుంచే చేప విత్తనాలను ప్రభుత్వం పంపిణీ చేయగా ఈ ఏడాది సైతం ఆగస్టులోనే చేప పిల్లలను పోసేలా చర్యలు చేపడుతున్నారు. సకాలంలో సమృద్ధిగా చేప విత్తనాలను పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టారు. గతంలో మైనర్ ఇరిగేషన్ సొసైటీల్లో మాత్రమే 80-100మిల్లీమీటర్ల పొడవుండే చేప పిల్లలను వేయగా రెండేళ్ల నుంచి పెద్ద చెరువులు ఏడాదంతా నీరుండే చెరువుల్లో 80-100మిల్లీమీటర్ల చేప పిల్లలు, సీజనల్ ట్యాంకు(చిన్న చెరువు)ల్లో 35-40మిల్లీమీటర్ల సైజు చేప పిల్లలను నీటి విస్తీర్ణాన్ని బట్టి పోస్తున్నారు.
టెండర్ల ప్రక్రియ ప్రారంభం
జిల్లాలోని చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో కోటికి పైగా చేప పిల్లలను వదల నుండడంతో ఇప్పటికే ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లను పిలిచారు. ఇందుకు గానూ సీడ్ కంపెనీలు టెండర్లు దాఖలు చేస్తున్నాయి. జూలై 2న టెక్నికల్ బిడ్స్ ఓపెన్ చేసి కంపెనీల అర్హతను పరిశీలించనున్నారు. ఫ్రీ క్వాలిఫికేషన్ బిడ్, టెక్నికల్ బిడ్లు పూర్తి చేసి చివరగా ఫైనాన్షియల్ బిడ్ పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత జిల్లా అదనపు కలెక్టర్ల నేతృత్వంలోని ఫైవ్ మెన్ కమిటీ ఈ కంపెనీలను పిలిచి చివరగా ఏ ధరకు ఇస్తారో అడిగి ఫైనల్ చేయనున్నారు. సీడ్ నాణ్యతను, ఆరోగ్య పరిస్థితిని సైతం క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరీక్షించనున్నారు. నీళ్లు నిండగానే సైప్లె ఆర్డర్లు ఇచ్చి చేప పిల్లలను తీసుకురానున్నారు.
ఆగస్టులో పంపిణీకి ఏర్పాట్లు ..
జిల్లాలో మత్స్యశాఖ పరిధిలోని సరస్వతి, పార్వతి బరాజ్లు, ఎల్లంపల్లి, నందిమేడారం రిజర్వాయర్లతో పాటు 188 చెరువులు, పంచాయతీల పరిధిలోని 880 చెరువుల్లో ఏకంగా కోటి 53లక్షల 78వేల 918 చేప పిల్లలను వదిలేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఆగస్టులో చేప పిల్లలను పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. టెండర్లు ప్రక్రియ ప్రారంభమైంది. నాణ్యమైన చేప విత్తనాలను పంపిణీ చేసేలా చూస్తున్నాం. ఇందుకు దాఖలైన టెండర్లను జూలై 2న పరిశీలించి వారి అర్హతలను బట్టి ఎంపిక చేసి టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత సంబంధించిన సీడ్ ఫాంలను మత్స్య శాఖ అధికారుల బృందం క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తుంది. ప్రభుత్వ తదుపరి ఉత్తర్వుల అనంతరం టెండర్లను ఖరారు చేసి ఫైనాన్షియల్ బిడ్ పూర్తి చేసి చేప పిల్లలను తీసుకొని పంపిణీ చేస్తాం.
-ఎండీ ఇంతియాజ్ అహ్మద్ఖాన్, జిల్లా మత్స్య అభివృద్ధి అధికారి పెద్దపల్లి