హైదరాబాద్, జూలై 1 (నమస్తేతెలంగాణ): తిరుమల శ్రీవారిని జూన్లో దర్శించుకున్న భక్తుల సంఖ్య స్వల్పంగా ఉన్నప్పటికీ హుండీ ఆదాయం మాత్రం పెరిగిందని టీటీడీ వెల్లడించింది. గత నెలలో శ్రీవారిని 4,14,674 మంది భక్తులు దర్శించుకోగా, హుండీ ద్వారా రూ.36.02 కోట్లు సమకూరినట్టు గురువారం తెలిపింది. తిరుమలలో భక్తులకు సేవలందించే కేంద్రాలను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నది. లడ్డూ వితరణ, కల్యాణ కట్ట కేంద్రాలు, వైకుంఠం టికెట్ల తనిఖీ కేంద్రం, సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీని కూడా అప్పగించారు. లడ్డూ కేంద్రంలో కేవీఎం ఇన్ఫోకామ్ సంస్థ సేవలు ప్రారంభించింది. టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, మైహోం గ్రూపు అధినేత జూపల్లి రామేశ్వరరావు హైదరాబాద్ త్రిదండి చినజీయర్స్వామి ఆశ్రమం నుంచి శ్రీవారికి నైవేద్యం సమర్పించేందుకు రూ.కోటి విలువైన గో వ్యవసాయ ఆధారిత వంట పదార్థాలు విరాళంగా అందజేశారు.
ఇందులో 6,200 కిలోల బియ్యం, 1,500 కిలోల దేశీ ఆవునెయ్యి, 600 కిలోల బెల్లం, 17 కిలోల బాదం, 315 కిలోల జీడిపప్పు, 21 కిలోల కిస్మిస్, 85 కిలోల ఆవాలు, 18 కిలోల మెంతులు, 20 కిలోల పసుపు, 25 కిలోల ఇంగువ, 380 కిలోల పెసరపప్పు, 200 కిలోల శనగపప్పు, 265 కిలోల మినుములు, 350 కిలోల చింతపండు, 50 కిలోల రాక్సాల్ట్, 375 కిలోల నువ్వుల నూనె, 7 కిలోల నువ్వులు, 10 కిలోల శొంఠి ఉన్నాయి. ఈ వస్తువులను టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శివకుమార్ శ్రీవారి ఆయలం ఎదుట అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో టీటీడీ పోటు పెష్కార్ శ్రీనివాసులు, ఆలయ ఓఎస్డీ పాలశేషాద్రి, ప్రకృతి వ్యవసాయ రైతు విజయరామ్, వేద పాఠశాల ప్రిన్సిపాల్ కేఎస్ఎస్ అవధాని, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డాక్టర్ ఆకెళ్ల విభీషణశర్మ పాల్గొన్నారు.