సింగపూర్ : శ్రీ సాంస్కృతిక కళాసారథి 2020 జూలైలో ఏర్పడిన అనతి కాలంలోనే సంగీత, సాహిత్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, నాటక రంగాల్లో విశేష కృషి చేస్తూ విజయవంతంగా దూసుకెళ్తున్నది. ఈ నేపథ్యంలో ‘అంతర్జాతీయ సాంస్కృతిక సమ్మేళనం 2021’ ద్వారా ప్రపంచవ్యాప్తంగా తెలుగు సంస్కృతి ఢంకా మోగించేందుకు శ్రీ సాంస్కృతిక కళాసారథి సిద్ధమైంది. ప్రథమ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా 2021 జూలై 3,4 తేదీల్లో ‘అంతర్జాతీయ సాంస్కృతిక సమ్మేళనం 2021’ అనే బృహత్యజ్ఞానికి శ్రీకారం చుట్టింది.
ప్రపంచ నలుమూలల్లో వివిధ దేశాలలో తెలుగువారి ప్రతిభకు పట్టం కట్టేందుకు ఈ సంస్థ రూపుదిద్దుకుంది. దీనికి సుమారు 34 దేశాల నుంచి 45 తెలుగు సంస్థలు సహకరించడానికి ముందుకు రావడం విశేషం.
అమెరికాలోని తానా, వంగూరి ఫౌండేషన్ వంటి ప్రముఖ సంస్థలతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేషియా, హాంకాంగ్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ కింగ్డమ్, నార్వే, దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్, కెనడా, మారిషస్ మొదలైన 34 దేశాల నుంచి తెలుగు కళాకారులు రచయితలు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ రచనలు, పాటలు నృత్యం మొదలైన కళాప్రదర్శనలు అందించబోతున్నారు.
కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు విజయేంద్ర సరస్వతి స్వామి తమ అనుగ్రహభాషణం అందించబోవడం ఈ కార్యక్రమానికి ఒక ప్రత్యేకతను సంతరింపజేస్తున్నది. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కవుటూరు రత్నకుమార్ మాట్లాడుతూ..భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ కార్యక్రమానికి ప్రారంభోపన్యాసం చేస్తారన్నారు.
అలాగే బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ, బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావు ఈ కార్యక్రమానికి విచ్చేసి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపనున్నారు. రామ్ మాధవ్, మండలి బుద్ధ ప్రసాద్ , జేడీ లక్ష్మీనారాయణ, వామరాజు సత్యమూర్తి , వంగూరి చిట్టెన్ రాజు, వంశీ రామరాజు వంటి పెద్దలు కూడా కార్యక్రమానికి విచ్చేసి ప్రసంగిస్తారని తెలిపారు.
భారతదేశం నుంచి కూడా వంశీ ఇంటర్నేషనల్, రాష్ట్రేతర తెలుగు సమాఖ్య వంటి సంస్థల సహకారంతో పాటుగా సురేఖ మూర్తి, ఎల్లా వెంకటేశ్వరరావు, మాండోలిన్ రాజేష్,నేమాని పార్థసారథి వంటి సంగీత దిగ్గజాలు, తనికెళ్ళ భరణి, భువనచంద్ర, మురళీ మోహన్, సాయి కుమార్, సాలూరు కోటి వంటి సినీ ప్రముఖులు ఈ ప్రపంచ వేదికను అలంకరించనున్నారు.
ఈ కార్యక్రమ నిర్వాహకులలోరాధిక మంగిపూడి, చామిరాజు రామాంజనేయులు కార్యక్రమ ముఖ్య సమన్వయకర్తలుగాఊలపల్లి భాస్కర్, గణేశ్న రాధాకృష్ణ ముఖ్య సాంకేతిక నిర్వాహకులుగా వ్యవహరిస్తుస్తారని ఆయన తెలిపారు. కాగా, ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా రెండు రోజులపాటు యూట్యూబ్, ఫేస్ బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుందని నిర్వాహకులు తెలిపారు.