న్యూఢిల్లీ, జూన్ 26: జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని భవిష్యత్ తరాలు కోరుకునే విధంగా అయోధ్యను నిర్మించాలని ప్రధాని మోదీ అన్నారు. మన సంప్రదాయాల్లో, మన అభివృద్ధిదశల్లో అత్యుత్తమమైనవాటిని అయోధ్య ప్రతిబింబించాలని చెప్పారు. అయోధ్య అభివృద్ధి ప్రణాళికపై ఉత్తరప్రదేశ్ అధికారులు చేసిన ప్రజంటేషన్ను మోదీ శనివారం వర్చువల్గా సమీక్షించారు. ఈ సమావేశంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు. ప్రతీ భారతీయుని సాంస్కృతిక చేతనలో అంతర్భాగంగా ఉండే అయోధ్య.. భవిష్యత్ అవసరాలకు సరిపోయేటువంటి మౌలికసదుపాయాలను కలిగి ఉండాలని ప్రధాని చెప్పారు. ఆధ్యాత్మిక కేంద్రంగా, ప్రపంచస్థాయి పర్యాటకస్థలంగా, స్మార్ట్సిటీగా అయోధ్య నిర్మాణం జరుగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా యూపీ అధికారులు.. అయోధ్యలో భక్తులకు కల్పించనున్న సదుపాయాలతోపాటు ఆశ్రమాలు, మఠాల నిర్మాణానికి తీసుకుంటున్న చర్యలు, విమానాశ్రయం, రైల్వే, బస్స్టేషన్ తదితర రవాణా, మౌలిక సదుపాయాలపై వివరాలను ప్రధానికి తెలియజేశారు. మరోవైపు, దేశంలో వేగంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్పైన కూడా ప్రధాని మోదీ శనివారం మరో సమావేశంలో సమీక్షించారు. గత ఆరురోజుల్లో 3.77 కోట్ల డోసుల టీకాలు వేయటం జరిగిందని పేర్కొంటూ.. ఇదే వేగాన్ని కొనసాగించాలని అధికారులకు సూచించారు.