మంచిర్యాల జిల్లా తాండూర్ సర్కిల్ పరిధిలో తనిఖీలు
రూ.16.50 లక్షల విలువైన పత్తి విత్తనాలు, గడ్డిమందు స్వాధీనం
11 మంది అరెస్ట్, మరో ముగ్గురు పరారీలో..
10 కేసులు నమోదు, ఇద్దరిపై పీడీ యాక్ట్
వివరాలు వెల్లడించిన రామగుండం సీపీ సత్యనారాయణ
తాండూర్, జూన్ 23 : మంచిర్యాల జిల్లా తాండూర్ సర్కిల్ పరిధిలో భారీగా నకిలీ పత్తి విత్తనాలు,గడ్డి మందు విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు బయటపడింది. తాండూర్ సర్కిల్ పోలీసులు నకిలీ విత్తనాలు, గడ్డిమందు వ్యాపారులు, అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టించారు. సుమారు రూ. 16.50 లక్షల పత్తి విత్తనాలు, నిషేధిత గడ్డిమందు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. తాండూర్ సర్కిల్ పరిధిలో ఇద్దరిపై పీడీ యాక్టు అమలు చేశారు. వారి నుంచి సుమారు రూ. 14 లక్షల విలువ చేసే ఏడు క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు, రూ. 2.50 లక్షల విలువ చేసే 500 లీటర్ల నిషేధిత గడ్డిమందును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రామగుండం సీపీ సత్యనారాయణ తాండూర్ సర్కిల్ కార్యాలయంలో బుధవారం వెల్లడించారు. నకిలీ విత్తనాలు, నిషేధిత గడ్డి మందు కట్టడిలో తాండూర్ సర్కిల్ ఇన్సెక్టర్ బాబురావు నేతృత్వంలో పోలీసు సిబ్బంది పని తీరును ప్రశంశించారు. రైతులకు అండగా నిలిచేందుకు కమిషనరేట్ పరిధిలో పోలీసులు పనిచేస్తున్నారని సీపీ తెలిపారు. రైతులను మోసం చేస్తున్న అక్రమార్కులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. నకిలీ దందా గుట్టురట్టు చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని సీపీ అభినందించి రివార్డులు అందజేశారు.
తాండూర్ పోలీస స్టేషన్ పరిధిలో రెండు కేసులు, మాదారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి, భీమిని పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు, కన్నెపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు కేసులు నమోదయ్యాయి. తాండూర్ మండలం కొమ్ముగూడెంకు చెందిన అక్కెపల్లి గోపాల్, భీమిని మండలం దుబ్బగూడెంకు చెందిన ఆకుల విఘ్నేశ్, ఎం శేఖర్, ఆకుల రాజేశ్, రాచకొండ అశోక్, కన్నెపల్లి మండలం ఖర్జిభీంపూర్కు చెందిన బెల్క సంతోష్, వాడి సంతోష్, జాంపెల్లికి చెందిన తాకిర సంతోష్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్కు చెందిన ఇరుగాల రమేశ్, అందవెల్లికి ముత్తినేని మహేందర్, ఏపీలోని ప్రకాశం జిల్లా జర్లముడికి మద్దుకూరి రాంబాబు పట్టుబడ్డారు. భారత్రెడ్డి (మహారాష్ట్ర), బీఆర్ కృష్ణారెడ్డి ఏడుకొండలు (కర్నూలు) పరారీలో ఉన్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బూరుగు గూడకు చెందిన లోకండి భిక్షపతి, భీమిని మండలం వడాలకు చెందిన జాడి వెంకటేశ్పై పీడీ యాక్ట్ నమోదు చేశారు. సమావేశంలో మంచిర్యాల డీసీపీ ఉదయ్కుమార్రెడ్డి, బెల్లంపల్లి ఏసీపీ రహమాన్, తాండూర్ సీఐ కోట బాబురావు, తాండూర్, మాదారం, భీమిని, కన్నెపల్లి ఎస్ఐలు కిరణ్కుమార్, మానస, కొమురయ్య, ప్రశాంత్రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.