ముంబై : మహారాష్ట్రలోని నాగపూర్లో దారుణం చోటుచేసుకుంది. మరదలిపై కన్నేసిన వ్యక్తి ఆమె లొంగకపోవడంతో మరదలుతో పాటు తన భార్య ఇద్దరు పిల్లలు, అత్తను దారుణంగా చంపి ఆపై తాను బలవన్మరణానికి పాల్పడిన ఘటన గోలీబార్ చౌక్ లోని నిందితుడి ఇంట ఆదివారం రాత్రి వెలుగుచూసింది. వాచ్మెన్గా పనిచేసే నిందితుడి మామ దేవిదాస్ విధులు ముగించుకుని ఇంటికి చేరుకున్నఅనంతరం ఈ ఘోరం బయటపడింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు అలోక్ మతుర్కర్ కొన్నేండ్ల కిందట విజయతో వివాహమైంది. వీరికి పరి, సాహిల్ అనే ఇద్దరు సంతానం కాగా విజయ సోదరి అమీష బోబ్డే ఇటీవల మతుర్కర్ నిర్వహించే టైలరింగ్ పనిలో అతడికి చేదోడువాదోడుగా ఉంటోంది. ఈ క్రమంలో మరదలిపై కన్నేసిన మతుర్కర్ ఆమెను లైంగికంగా వేధించేవాడు. ఆమె తన ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడుతుండగా అనుమానంతో వేధింపులకు గురిచేశాడు.
బావ ప్రవర్తనపై విసిగిన బాబ్డే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముందస్తు చర్యల్లో భాగంగా అతడిని అదుపులోకి తీసుకుని అనంతరం విడుదల చేశారు. మతుర్కర్ తీరుపై ఆదివారం రాత్రి తన అక్కతో బాబ్డే వాదనకు దిగడంతో ఆగ్రహంతో ఊగిపోయిన నిందితుడు మరదలు, భార్య, తన ఇద్దరు పిల్లలతో పాటు అత్తను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. పదకం ప్రకారమే ఆన్లైన్లోకత్తులకు ఆర్డర్ ఇచ్చిన నిందితుడు ఉన్మాదిగా మారి కుటుంబ సభ్యులను పొట్టనపెట్టుకోవడంతో పాటు ఆపై తాను ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.