హైదరాబాద్, జూన్ 21: వైరస్ నుంచి వ్యాక్సిన్లు సమర్థవంతమైన రక్షణనిస్తున్నాయని, టీకా వేసుకున్న వారు మరణించినట్టు తాము చేసిన అధ్యయనంలో ఇప్పటివరకూ వెల్లడికాలేదని హైదరాబాద్కు చెందిన ఓ దవాఖాన చేసిన సర్వేలో తేలింది. 12 వేల మంది వైద్య సిబ్బందిపై మెడికవర్ దవాఖాన ఇటీవల ఓ అధ్యయనాన్ని చేపట్టింది. తొలి డోసు వేసుకున్న వారిలో 13 శాతంమందికి మళ్లీ వైరస్ సోకిందని, 2.63 శాతం మందికి మాత్రమే దవాఖాన చికిత్స అవసరం పడిందని ఆ సర్వేలో తేలింది. ఇక, రెండు డోసులు వేసుకున్నవారిలో 2.8 శాతం మందికి మళ్లీ కరోనా సోకగా, దవాఖాన చికిత్స అవసరమైనవారి సంఖ్య 0.4 శాతం కంటే తక్కువగా ఉన్నట్టు సర్వే వెల్లడించింది. వ్యాక్సిన్ వేసుకున్న వారిలో రక్తం గడ్డకట్టడం, మరణాలు వంటివి నమోదుకాలేదని మెడికవర్ దవాఖాన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ శరత్రెడ్డి తెలిపారు. అనుమానాలు లేకుండా ప్రజలందరూ టీకాలు వేసుకోవాలని సూచించారు.