ముంబై: డార్క్ నెట్లో బిట్ కాయిన్ ఉపయోగించి విదేశాల నుంచి మత్తు పదార్థాలు (డ్రగ్స్) కొనుగోలు చేస్తున్న వ్యక్తిని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అరెస్ట్ చేసింది. సదరు వ్యక్తి యూరప్ దేశాల నుంచి ఈ డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నాడని అభియోగం.
గతేడాది నవంబర్లో మహారాష్ట్రలోని మలాద్ జిల్లా ఖారోదీ గ్రామంలో ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. 20 బ్లాట్స్ ల్యాసెర్జిక్ యాసిడ్ డైథ్య్లామైడ్ (ఎల్ఎస్డీ) జప్తు చేశారు.
ఈ సందర్భంగా డ్రగ్స్ వ్యసనపరులు విదేశాల నుంచి డ్రగ్స్ తెచ్చి పెట్టాలని తనను కోరారని ఎన్సీబీ విచారణలో మాకరాండ్ అలియాస్ క్రిప్టో కింగ్ చెప్పాడు. దీనిపై తనకు స్వల్ప లాభాలు ఉంటాయన్నాడు.
డార్క్ నెట్ను ఉపయోగించి డ్రగ్ డీలర్ల నుంచి డ్రగ్ కార్టెల్స్కు చెల్లింపులు జరిపేందుకు ఒక క్రిప్టో కరెన్సీ డీలర్ క్రిప్టో ఖాతాలు తెరిచాడని మాకరాండ్ ఆరోపించాడు. ముంబైలోని వివిధ ప్రాంతాల నుంచి మాకరాండ్ డ్రగ్స్ సేకరించేవాడని దర్యాప్తులో తేలింది.
దీంతో ఎన్సీబీ అధికారులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. మరోవైపు మాకరాండ్ మొబైల్స్, కంప్యూటర్ తదితరాలను తనిఖీ చేశారు. మరోవైపు డ్రగ్స్ కొనుగోలుకు వాడుతున్న క్రిప్టో కరెన్సీల ఖాతాలను సంబంధిత క్రిప్టో కంపెనీకి లేఖ రాశారు.
ఎల్ఎస్డీతోపాటు హెరాయిన్, హైడ్రోపోనిక్ వీడ్స్, బడ్స్ తదితర డ్రగ్స్ ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి సరఫరా అవుతుందని ఎన్సీబీ అధికారులు తెలిపారు. ఎటువంటి కేవైసీ నిబంధనలు పాటించకుండానే క్రిప్టో కరెన్సీని వాడుతున్నట్లు గుర్తించారు. దీంతో ఈ అంశంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేపట్టింది.