న్యూఢిల్లీ : లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) లో ఇరు వర్గాల మధ్య చోటు చేసుకున్న విబేధాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్న నేపథ్యంలో.. చిరాగ్ పాశ్వాన్ కజిన్ ప్రిన్స్ రాజ్ పాశ్వాన్ పై లైంగికదాడి కేసు నమోదైంది. ప్రిన్స్ రాజ్ తనను లైంగికంగా వేధించాడని బాధిత మహిళ.. ఫిర్యాదు చేసినట్లు ఢిల్లీ కన్నాట్ ప్లేస్ పోలీసులు తెలిపారు. ప్రిన్స్ లైంగిక వేధింపుల గురించి బాబాయ్ పశుపతి పరాస్కు తెలియజేస్తూ మార్చి 29 లేఖ రాసినట్టు చిరాగ్ పాశ్వాన్ మంగళవారం దానిని మీడియాకు విడుదల చేశారు.
రాంవిలాస్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ను సోమవారం ఎల్జేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. చిరాగ్తో కలిసి ఆ పార్టీ తరఫున ఆరుగురు లోక్సభ సభ్యులు ఉండగా, అందులో అయిదుగురు ఓ వర్గంగా ఏర్పడ్డారు. చిరాగ్ చిన్నాన్న, ఎంపీ పశుపతి కుమార్ పారస్ను తమ అధ్యక్షునిగా ఎన్నుకున్నారు.