బెంగళూర్ : జూన్ మాసాంతానికి కర్నాటకలో 45 ఏండ్లు పైబడిన వారిలో 80 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తవుతుందని డిప్యూటీ సీఎం అశ్వథ్ నారాయణన్ పేర్కొన్నారు. వ్యాక్సిన్ల కొరతతో బెంగళూర్ లో 45 ఏండ్లు పైబడిన వారిలో ఇప్పటివరకూ 63 శాతం మందికే వ్యాక్సినేషన్ చేపట్టామని చెప్పారు. ప్రాధాన్యతా క్రమంలో 18-45 ఏండ్ల మధ్య వయస్కులకూ వ్యాక్సినేషన్ సాగుతోందని ఏడాది చివరికి రాష్ట్ర జనాభాలో 18 ఏండ్లు పైబడిన వారందరికీ కనీసం సింగిల్ డోస్ వ్యాక్సిన్ అందిస్తామని చెప్పారు.
థర్డ్ వేవ్ చిన్నారులపైనే ప్రభావం చూపదని వ్యాక్సిన్ తీసుకోని వారితో పాటు, ఇప్పటికీ ఇన్ఫెక్షన్ సోకని వారిపై ప్రభావం చూపుతుందని వైద్యారోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. యువ తల్లితండ్రులు వ్యాక్సిన్ వేయించుకోవడంలో అలసత్వం వహిస్తే థర్డ్ వేవ్ లో చిన్నారులు కరోనా బారినపడే ప్రమాదం అధికంగా ఉంటుందని ఏస్టర్ సీఎంఐ ఆస్పత్రి పీడియాట్రీషియన్ డాక్టర్ చేతన్ గినిగెరి హెచ్చరించారు.