న్యూఢిల్లీ: దేశీయంగా స్మార్ట్ సిటీల్లో హెల్త్కేర్ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులేస్తున్నది. ఇందుకోసం రూ.50 వేల కోట్లు ఖర్చు చేయనున్నది. దీని కింద రుణ పరపతి కల్పించనున్నదని తెలుస్తున్నది. కొత్త దవాఖానల నిర్మాణానికి, ఇప్పటికే ఉన్న వాటిని విస్తరించేందుకు రుణ పరపతి లభిస్తుంది.
దేశంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో దవాఖానల నిర్మాణంతోపాటు హెల్త్కేర్ వ్యవస్థ బలోపేతం చేసే అంశంపై త్వరలో క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవచ్చునని తెలుస్తున్నది. భోపాల్, లక్నో, ఇండోర్, బరోడా, వారణాసి వంటి నగరాల్లోనూ ఈ తరహా వసతులు కల్పించనున్నారు.
ఈ స్కీమ్ కింద దవాఖానలకు రూ.2 కోట్ల వరకు పూచీకత్తు లేని రుణం లభిస్తుంది. ఈ రుణం దవాఖాన ప్రాంగణంలో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణానికి ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ లోన్కు ప్రభుత్వం పూర్తి హామీనిస్తుంది. దీనిపై 7.5 శాతం వడ్డీరేటు వసూలు చేస్తారు.
వచ్చే ఏడాది మార్చి వరకు వ్యాక్సిన్లు, ఆరోగ్య సేవలందించే సంస్థల కోసం ఆర్బీఐ రూ.50 వేల కోట్లతో ఆన్టాప్ లిక్విడిటీ విండోను ప్రవేశపెట్టింది. కరోనా వేళ దేశీయ ఆరోగ్య వ్యవస్థ తీవ్రంగా దెబ్బ తిన్నది.
పేషంట్లకు దవాఖానల్లో బెడ్లు లేక, ఆక్సిజన్ దొరకక ఇబ్బందులు పడ్డారు. థర్డ్ వేవ్ రాకముందే దేశంలో ఆరోగ్య వసతులను మెరుగు పర్చాలని కేంద్రం భావిస్తున్నది.
కోవిడ్ వల్ల దెబ్బతిన్న ఎయిర్లైన్స్, హాస్పిటల్స్కు 41 బిలియన్ల డాలర్ల ఎమర్జెన్సీ క్రెడిట్ ప్రోగ్రామ్ను గత నెలలో కేంద్రం ఆమోదించింది. దేశ జనాభాతో పోలిస్తే దవాఖానల్లో లభ్యం అవుతున్న బెడ్లు చాలా తక్కువ.
మహారాష్ట్రలోని పుణెలో ప్రతి 1000 మంది జనాభాకు 1.5 బెడ్లు మాత్రమే ఉన్నాయి. ఇతర నగరాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. దేశంలోని ప్రతి నగరంలో దవాఖానలు లేక, ఆక్సిజన్ అందక వేల మంది ప్రాణాలు కోల్పోయారు.