జగిత్యాల: జిల్లాలోని ఇబ్రహీంపట్నం ఎంపీటీసీ భర్త దారుణ హత్యకు గురయ్యారు. ఎంపీటీసీ మమత భర్త రాజారెడ్డిని మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి హత్య చేశాడు. రాజారెడ్డి, రమేశ్ అనే వ్యక్తితో కలిసి నిన్న రాత్రి మద్యం సేవించాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య మాటామాటా పెరిగి అది గొడవగా మారింది. మద్యం మత్తులో ఉన్న రమేశ్ క్షణికావేశంలో రాజారెడ్డిని రాయితో విచక్షణా రహితంగా కొట్టాడు. దీంతో అతడు ఘటనా స్థలంలోనే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.