పల్లె ప్రగతిలో పంచాయతీ ముందంజ
గ్రామంలో ప్రతి వీధికి సీసీ రోడ్డు
తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
నర్సరీలో 16 వేల మొక్కల పెంపకం
మణుగూరు రూరల్, జూన్14: ఒకప్పుడు సమస్యలతో ఇబ్బంది పడ్డ పంచాయతీ నేడు అభివృద్ధి బాటలో పయనిస్తున్నది. డంపింగ్యార్డు, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, అవెన్యూ ప్లాంటేషన్, నర్సరీలతో పంచాయతీ ఆహ్లాదభరితంగా మారింది. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి పనులతో మండలంలోని దమ్మక్కపేట పంచాయతీలో సాధ్యమైంది. నిత్యం పారిశుధ్య పనులతో గ్రామం పరిశుభ్రంగా మారింది. రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలతో గ్రామ స్వరూపమే మారిందని గ్రామస్తులు చెబుతున్నారు. మొత్తం 1300 జనాభా , 175 కుటుంబాలు నివసిస్తున్న ఈ పంచాయతీ అతి తక్కువ సమయంలోనే చాలా మార్పు చెందింది.
పంచాయతీలో జరిగిన అభివృద్ధి..
పంచాయతీలో ఏర్పాటు చేసిన రెండు పల్లె ప్రకృతివనాల్లో మొత్తం 4500 మొక్కలు నాటి వన సేవకుడిని నియమించారు. పేరంటాల చెరువు నుంచి నీటిని అందించేందుకు మోటార్ను ఏర్పాటు చేసి ప్రతిరోజూ మొక్కలకు నీటిని అందిస్తున్నారు. సీఎస్ఆర్ నిధుల కింద మంజూరైన రూ.12 లక్షలతో 3 సీసీ రోడ్లు, ఒక గ్రావెల్ రోడ్డు నిర్మించి గ్రామస్తులకు రహదారి సౌకర్యం కల్పించారు. రూ.12.50 లక్షలతో నిర్మిస్తున్న వైకుంఠధామం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. రూ.2.39 లక్షలతో నిర్మించిన డంపింగ్యార్డు కు ప్రతిరోజూ గ్రామంలో సేకరించిన చెత్తను తరలిస్తున్నారు. అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 2వేల మొక్కలు రోడ్డుకిరువైపులా నాటి ఉపాధి హామీ పథకం ద్వారా వాటికి నీరు అందిస్తున్నారు. ఇంటింటికీ మొక్కలు అందజేసేందుకు నర్సరీలో మొత్తం 16వేల మొక్కలు పెంచుతున్నారు.
సమష్టి సహకారంతో..
అధికారులు, ప్రజాప్రతినిధుల సమష్టి సహకారంతో గ్రామంలో అభివృద్ధి జరుగుతున్నది. పంచాయతీలో పారిశుధ్య పనులు, వారానికి వీధికి మూడుసార్లు వచ్చే విధంగా ప్రతీ వీధికి చెత్త బండి వెళ్లే విధంగా పంచాయతీ సిబ్బందికి సూచనలిస్తున్నాం. చెత్తను సేకరించి డంపింగ్యార్డుకు తరలిస్తున్నాం. బీటీపీఎస్ రావడంతో సీఎస్ఆర్ కింద తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరాం.
కుర్సం రాంబాబు, దమ్మక్కపేట సర్పంచ్
ఇప్పుడే గ్రామం బాగుంది..
అప్పట్లో చెత్త రెండు మూడు వారాలకోసారి ఎత్తేటోళ్లు. ఇప్పుడేమో రెండు మూడు రోజులకోసారి పంచాయతీ చెత్త సేకరణ బండి వస్తాంది. ఇప్పుడు కాల్వల్లో చెత్తను ఎత్తేయడంతో మురుగునీరు నిల్వ ఉండట్లే. రోడ్లేశారు. రోడ్ల పక్కన చెట్లు నాటారు.
అనిత, స్థానికురాలు