న్యూఢిల్లీ: కరోనా రెండో వేవ్ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో దేశీయ స్టాక్ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడుల రాక మెరుగైంది. ఎకానమీ కోలుకుంటుందన్న సంకేతాల మధ్య ఈ నెల 11వ తేదీ వరకు వివిధ సంస్థల్లో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) రూ.15,520 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేశాయి.
గత ఏప్రిల్, మే నెలల్లో స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను విత్ డ్రా చేసుకున్నారు. గత రెండు నెలల్లో కరోనా రెండో వేవ్ కేసులు ఉధ్రుతంగా పెరుగుతుండటంతో వారిలో సెంటిమెంట్ బలహీన పడింది. ఏప్రిల్లో రూ.9,435 కోట్లు, ఏప్రిల్లో రూ.2,666 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు.
ప్రస్తుతం కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతోపాటు ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్నాయి. దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బల పడింది. డెట్ మార్కెట్లో ఇన్వెస్టర్ల ఇంటరెస్ట్ బలహీనపడింది.
ఫలితంగా ఈ నెల 11 వరకు ఇన్వెస్టర్లు రూ.2,096 కోట్ల మేరకు పెట్టుబడులు విత్ డ్రా చేసుకున్నారు. మొత్తం ఎఫ్పీఐ పెట్టుబడులు రూ.13,424 కోట్ల వద్ద నిలిచాయి.
దక్షిణ కొరియా, థాయిలాండ్, ఇండోనేషియా స్టాక్ మార్కెట్లలోనూ ఎఫ్పీఐ పెట్టుబడులు పెరిగాయి. థాయిలాండ్లో 188 మిలియన్ల డాలర్లు, దక్షిణ కొరియాలో 140 మిలియన్ల డాలర్లు, ఇండోనేషియాలో 138 మిలియన్ల డాలర్లు, ఫిలిప్పీన్స్లో 125 మిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెరిగాయి.