న్యూఢిల్లీ : లద్దాఖ్ సరిహద్దులో చైనా దుందుడుకు వ్యవహరిస్తున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ఇప్పటికే దేశ రక్షణలో రాజీ లేదని ప్రకటించిన సైన్యం.. వచ్చే వారం కీలకమైన సమావేశం నిర్వహించనున్నట్లు రక్షణ వర్గాలు పేర్కొన్నాయి. కమాండర్ ఇన్ చీఫ్ ర్యాంకు స్థాయి అధికారులు ఈ భేటీలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా వాస్తవాధీన రేఖ వెంట భద్రతా దళాల సంసిద్ధత అంశంపై సమగ్రంగా చర్చించనున్నారు. డ్రాగన్ దేశానికి దీటుగా బదులిచ్చేలా కార్యాచరణ రూపొందించనున్నారు. వాస్తవాధీన రేఖ వెంట ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండేలా ప్రణాళిక రచించనున్నారు.
ఈ నెల 16 నుంచి రెండు రోజుల ఉన్నత స్థాయి అధికారులు సమావేశం కానున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే దేశ భద్రతకు సంబంధిచిన ఇతర సమస్యలపై సైతం భేటీలో ఉన్నత స్థాయి అధికారులు సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవనే ఎల్ఏసీ వెంట పరిస్థితులను ఇటీవల స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆయన ఏడు నుంచి ఎనిమిది సార్లు లడఖ్ను సందర్శించారు. గతేడాది గాల్వాన్ లోయలో చైనాకు దీటుగా బదులిచ్చిన భారత సైన్యం చైనా కవ్వింపు చర్యలను నిశితంగా పరిశీలిస్తోంది. గల్వాన్ ఘర్షణ అనంతరం సరిహద్దుల్లో భారత్ యుద్ధ విమాన కార్యకలాపాలను పెంచింది.
ఈ వేసవిలో సరిహద్దులో బలగాలు, ఫైట్ జైట్లు, మిగ్-29తో పాటు సైన్యంలో కొత్తగా చేరిన రాఫెల్ యుద్ధ విమానాలను సైతం మోహరించి గస్తీ పెంచి భారత్ సత్తా చూపింది. బలగాల ఉపసంహరణ వంటి ప్రాంతాల నుంచి చైనా తన సైనికులను వెనక్కి తీసుకెళ్లినా.. పలు యుద్ధ విమానాలను అక్కడే ఉంచిందని రక్షణ వర్గాలు తెలిపాయి. ఇటీవల చైనా మిలిటరీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలను చేపడుతూ భారత్ను కవ్విస్తోంది. గాల్వాన్ ఘర్షణ తర్వాత నుంచి ఇరు దేశాల మధ్య సైనిక చర్చలు, దౌత్యంతో కొంత ఉద్రిక్తతలు తగ్గినా.. ఇంకా ప్రతిష్ఠంభణ కొనసాగుతున్నది.