న్యూఢిల్లీ : ఉన్నత విద్యనభ్యసించే బాలికల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. గతంతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువగా యువతులు కళాశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీని ద్వారా బాల, బాలికల మధ్య అంతరం తగ్గుతున్నది. ప్రస్తుతం కాలేజీల్లో 49శాతం విద్యార్థినులు చదువుతున్నారని ఉన్నత విద్యపై నిర్వహించిన ఆల్ ఇండియా స్థాయి సర్వేలో వివరాలు వెల్లడయ్యాయి. 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించిన సర్వే నివేదిక గురువారం విడుదలైంది.
2015-16 నుంచి 2019-20 మధ్య ఐదేళ్ల కాలంలో విద్యార్థినుల నమోదులో 11.4శాతం వృద్ధి కనబరిచింది. ఈ సమయంలో మహిళల నమోదు 18.2 శాతం పెరిగింది. ఉన్నత విద్యలో 38.5 మిలియన్ల విద్యార్థులు చేరగా.. ఇందులో 19.6 మిలియన్ల బారులు, 18.9 మిలియన్ల బాలికలు ఉన్నట్లు సర్వే అంచనా వేసింది. ఉన్నత విద్యలో ఎక్కువ విద్యార్థులు చేరిన రాష్ట్రాల జాబితాలో ఉత్తర ప్రదేశ్ మొదటి స్థానంలో నిలువగా.. ఆ తర్వాత మహారాష్ట్ర, తమిళనాడు ఉన్నాయి.
గొప్ప ముందడుగు
దేశంలో ఉన్నత విద్యా సంస్థల్లో 18-23 సంవత్సరాల వయసు గల స్థూల నిష్పత్తి (జీఈఆర్) 27.1 శాతం. పురుష జనాభా నిష్పత్తి 26.9, మహిళల నిష్పత్తి 27.3. షెడ్యూల్డ్ కులాల, తెగల నిష్ఫత్తిని జాతీయ నిష్పత్తి 27.1తో పోలిస్తే 18.0 శాతం. నివేదిక విడుదల చేసిన ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి అమిత్ ఖరే మాట్లాడుతూ జాతీయ విద్యా విధానంలో భాగంగా నాణ్యమైన, న్యాయమైన విద్యను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు కృషి జరుగుతోందన్నారు. ఉన్నత విద్యలో విద్యార్థినీ, విద్యార్థుల నమోదు నిరంతరం పెరుగుతుండడం, విద్యా సంస్థల సంఖ్య పెరగడం, స్త్రీ, పురుష సమానత్వం రావడం ఈ దిశగా గొప్ప ముందడుగు అని వివరించారు.
స్థూల నమోదు నిష్పత్తి 2019-20లో మైనస్ 0.8శాతం పెరిగింది. 2019-20లో ఉన్నత విద్యలో చేరిన అర్హత గల వయసు విద్యార్థుల శాతం 27.1. కాగా, 2018-19లో 26.3శాతం, 2014-15లో 24.3శాతం, 2018-19లో 3.74 కోట్లతో పోలిస్తే 2019-20లో ఉన్నత విద్యలో 3.85 కోట్లుగా ఉంది. గత ఐదేళ్ల కాలంలో స్థూల నమోదు నిష్పత్తి 11శాతం పెరిగింది. మహిళల నమోదు 18శాతం పెరుగుదల నమోదు చేసింది. జీఈఆర్ 2018-20లో 26.3శాతం, 2019-20లో 27.1శాతం, 2014-15లో 24.3శాతానికి పెరిగింది. ఇక విశ్వ విద్యాలయాల సంఖ్య 2015-16లో 799 ఉండగా.. 35.5 శాతం పెరిగి 2019-20లో 1,043కు పెరిగాయి.