సొసైటీ చైర్మన్ వాజిద్ అలీ
నిజాంసాగర్, జూన్ 8 : కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లలో గున్కుల్ సొసైటీ జిల్లాలోనే రెండో స్థానంలో నిలిచిందని సొసైటీ చైర్మన్ వాజిద్అలీ అన్నారు. సొసైటీ కార్యాలయంలో రైతులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సొసైటీ పరిధిలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో 2,826 మంది రైతుల నుంచి 3.61 లక్షల బస్తాల (1.44 లక్షల క్వింటాళ్ల) ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. మొత్తం రూ.27.26 కోట్ల విలువ చేసే ధాన్యం కొనుగోలు చేసి 2,250 మంది రైతులకు సుమారు రూ.21.50 కోట్ల డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభరాజు చొరవతో కార్గో సేవల ద్వారా మిల్లులకు ధాన్యం తరలింపు ప్రక్రియ పూర్తిచేశామని తెలిపారు. సమావేశంలో సీడీసీ చైర్మన్ గంగారెడ్డి, నాయకులు నాయకుడు దఫేదార్ విజయ్, కాశయ్య, లక్ష్మీనారాయణ, అఫ్జల్, రెడ్యానాయక్, చందర్, సొసైటీ సిబ్బంది సాయితేజ, భాస్కర్, వికాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.