కీసర, మే 7: పోలీసులు.. ప్రజలతో మమేకమై ఫ్రెండ్లీ పోలీసింగ్ సేవలు అందించాలని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ సూచించారు. కీసర పోలీస్ స్టేషన్లో నిర్మించిన అదనపు భవనాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు.. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. దాతల సహకారంతో సీఐ నరేందర్గౌడ్ ప్రత్యేక చొరవ చూపి భవనాన్ని నిర్మించడం చాలా సంతోషంగా ఉందన్నారు. పోలీసులు స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులతో చక్కటి బంధాలను ఏర్పరుచుకొని.. ప్రజల్లో పోలీసులంటే ప్రేమను పెంచాలన్నారు. అన్ని పోలీస్స్టేషన్లలో అత్యాధునిక సౌకర్యాలు, వసతులను కల్పిస్తున్నామన్నారు. ఉత్తమ సేవలు అందిస్తున్న కీసర పోలీసులకు, భవన నిర్మాణానికి సహకరించిన దాతలకు సీపీ షీల్డులు అందజేసి సన్మానించారు. అనంతరం స్టేషన్లో మొక్క లు నాటారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ సుధీర్బాబు, మల్కాజిగిరి డీసీపీ రక్షితమూర్తి, ఏసీపీ శివకుమార్, సీఐ నరేందర్గౌడ్, ఎస్ఐలు పాల్గొన్నారు.