బీజింగ్: కరోనా వ్యాప్తికి కారణమైన చైనా ఇప్పుడు దేశంలో మహమ్మారి కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. చైనా లక్ష్య జనాభాలో కనీసం 70 శాతం మందికి ఈ ఏడాది చివరి నాటికి కొవిడ్ -19 టీకాలు వేసే అవకాశం ఉందని జాతీయ ఆరోగ్య కమిషన్ (ఎన్హెచ్సీ) డిప్యూటీ హెడ్ డాక్టర్ జెంగ్ ఇక్సిన్ వెల్లడించారు. ఇటీవల నమోదైన కరోనా కేసులను గమనిస్తే మహమ్మారి నివారణ, నియంత్రణ చర్యలు నిరంతంగా ఉధృతంగా కొనసాగించాల్సిన అవసరముందన్నారు.
టీకాలు వేసుకునేందుకు ప్రజలు వెనుకాడవద్దని కోరారు. అందరం కలిసికట్టుగా ఉండి “గ్రేట్ వాల్ ఆఫ్ ఇమ్యునైజేషన్” లక్ష్యాన్ని సాధిద్దామని పిలుపునిచ్చారు. ఎన్హెచ్సీ డేటా ప్రకారం.. ఇప్పటివరకూ చైనా అంతటా 763 మిలియన్ డోసు కొవిడ్-19 టీకాలు ఇచ్చారు. కరోనా మహమ్మారి మొదట 2019 డిసెంబర్లో చైనా హుబీ ప్రావిన్స్లోని వుహాన్ నగరంలో వెలుగుచూసింది.ఇప్పటివరకు చైనాలో 91,248 కరోనా కేసులు నమోదయ్యాయని, 4,636 మంది మృత్యువాతపడ్డారని చైనా వెల్లడించింది.