హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు రెండుమూడు రోజుల్లో రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. గురువారం కేరళలోకి ప్రవేశించిన రుతుపవనాలు శుక్రవారం ఏపీలోని రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లోకి ప్రవేశించాయి. దక్షిణ మధ్య అరేబియా సముద్రం, లక్షద్వీప్ కేళర తీర ప్రాంతం, కర్ణాటక, తమిళనాడుల్లోని కొన్ని ప్రాంతాలు, నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి చేరుకున్నాయి. రానున్న రెండుమూడు రోజుల్లో తెలంగాణలోని దక్షిణ జిల్లాలతోపాటు మిగతా అరేబియా సముద్రం, మహారాష్ట్ర, గోవా, ఏపీలోని మిగతా ప్రాంతాలు, కర్ణాటకలోని మరి కొన్నిచోట్ల నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. రాష్ట్రంలో పశ్చిమ గాలులు వీస్తున్నాయని, శుక్రవారం కిందిస్థాయి గాలులు నైరుతి దిశగా రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయని చెప్పారు. దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల వరకు ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తెలంగాణ నుంచి దక్షిణ తమిళనాడువరకు వ్యాపించి ఉన్న ఉపరితలద్రోణి బలహీన పడింది. రాష్ట్రంలో ఈ నెల 8వ తేదీవరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఒకటిరెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని నాగరత్న వివరించారు. ఈ వర్షాకాలం సీజన్లో ఈ నెల 4 నుంచి 17వ తేదీ మధ్యలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నదని వివరించారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు నారాయణపేట మినహా అన్ని జిల్లాల్లో వర్షం కురిసింది. మహబూబాబాద్ జిల్లా అమనగల్లో 11.98, కురవి మండలం ఉప్పరగూడెంలో 8.70, అయ్యంగారిపల్లెలో 8.30, మహబూబాబాద్ పట్టణంలో 7.48, కొత్తగూడలో 7.30, కేసముద్రంలో 7, గంగారంలో 6.80, వరంగల్ రూరల్ జిల్లా ఖానాపూర్ మండలం మంగళవారిపేటలో 8, సిద్దిపేట జిల్లా ములుగులో 8.15, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లో 5.53, సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో 4.45, ఆదిలాబాద్ జిల్లా సోనాలలో 3.88, యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో 5.53, సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం మునిగడపలో 5, చాట్లపల్లిలో 4.95 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో 2 సెంటీమీటర్లకు పైగానే వర్షపాతం నమోదైంది. వర్షాల నేపథ్యంలో ఉష్ణోగ్రతలు తగ్గాయి.