తూప్రాన్ రూరల్/రామాయంపేట, జూన్ 4: వ్యవసాయరంగాన్ని మరింత అభివృద్ధి చేయడంతోపాటు రైతులు, చిరు వ్యాపారులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు సీఎం కేసీఆర్ ఎంతో కృషిచేస్తున్నారని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణ పరిధిలోని అల్లాపూర్ టోల్ప్లాజా వద్ద రూ.1.60 కోట్లతో నిర్మించిన రైతు బజార్ను, చిరువ్యాపారులు విక్రయించడానికి, కూరగాయలను కొనుగోలు చేసేందుకు వచ్చే వారికోసం ఏర్పాటుచేసిన మినరల్ వాటర్ ట్యాంకును శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. రైతులు కష్టపడి పండించిన ధాన్యాలు, కూరగాయలకు సరైన మద్దతు ధరను కల్పించడం కోసమే వ్యవసాయ మార్కెట్ యార్డులు, రైతు బజార్లను సీఎం ఏర్పాటుచేస్తున్నట్టు తెలిపారు. రైతు బజార్లో వివిధ రకాలైన పండ్లు, కూరగాయలు, మక్క బుట్టలు, వేరుశనగలు, టీస్టాళ్లను పెట్టుకునేందుకు 50 మంది వరకు అవకాశం ఉన్నదని చెప్పారు. స్టాళ్ల కేటాయింపులో ముందుగా వచ్చి కూర్చున్నవారికి మొదటి ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. అవసరమైతే మరిన్ని షెడ్లను నిర్మించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఇక నుంచి రోడ్లపై విక్రయించకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులదేనన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్గౌడ్, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి, కలెక్టర్ హరీశ్, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.