న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్కు సన్నద్ధమయ్యేందుకు ఇంగ్లండ్ వెళ్లనున్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజుకు ధన్యవాదాలు తెలిపింది. తన కుమారుడు ఇజాన్ను ఇంగ్లండ్ తీసుకెళ్లేందుకు అనుమతులు ఇప్పించాల్సిందిగా సానియా కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖను కోరగా.. కుమారుడితో పాటు సోదరిని కూడా తీసుకెళ్లేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. ‘క్రీడా మంత్రి కిరణ్ రిజిజుకు ప్రత్యేక ధన్యవాదాలు. సాయ్తో పాటు బ్రిటన్ ప్రభుత్వం నా కుమారుడు ఇజాన్, సోదరి ఆనమ్ను వెంట తీసుకెళ్లేందుకు అనుమతించింది’అని సానియా ట్వీట్ చేసింది. ఒలింపిక్స్కు ముందు సానియా బర్మింగ్హామ్ ఓపెన్ (జూన్ 14 నుంచి), ఎస్తాబోర్న్ ఓపెన్ (జూన్ 20 నుంచి), వింబుల్డన్ (జూన్ 28 నుంచి)లో పాల్గొననుంది.