పౌర విమానయాన పరిశ్రమపై కరోనా పెను ప్రభావం: విస్తారా సీఈవో
ముంబై, జూన్ 1: పౌర విమానయాన పరిశ్రమకు ఎదురైన అత్యంత గడ్డు పరిస్థితుల్లో కరోనా సంక్షోభం కూడా ఒకటని విస్తారా సీఈవో లెస్లీ త్నగ్ అన్నారు. కొవిడ్-19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలకు పెద్ద దెబ్బే తగిలిందని చెప్పారు. అయితే పూర్తిస్థాయిలో విమానయాన రంగం మళ్లీ కోలుకోవడానికి వ్యాక్సినేషన్ ఎంతో ఉపయోగపడగలదని అభిప్రాయపడ్డారు. పీటీఐకి ఈ-మెయిల్ ద్వారా ఇచ్చిన ఇంటర్వ్యూలో కరోనా సెకండ్ వేవ్.. దేశీయ విమాన ప్రయాణాలపై పెను ప్రభావాన్నే చూపిందన్నారు. కాగా, ప్రస్తుత పరిణామాల మధ్య స్వల్పకాలిక ప్రణాళికల్లో కొన్ని తాత్కాలిక సర్దుబాట్లు, మార్పులు చేస్తున్నామన్న ఆయన దీర్ఘకాలిక విస్తరణకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. అలాగే ఈ విపత్కర పరిస్థితుల్లోనూ ఉద్యోగాలకు ఎలాంటి ముప్పు రాకుండా చూస్తామన్నారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు చాలా రాష్ర్టాలు ప్రయాణాలపై ఆంక్షలు పెట్టాయని, దీంతో సహజంగానే విమానయానం కూడా ప్రభావితమైందని తెలిపారు. ఈ నేపథ్యంలో 25-30 శాతం విమానాలనే నడుపుతున్నామన్నారు. కాగా, మంగళవారం నుంచి 50 శాతం ప్రయాణీకులతో దేశీయ సేవలను ప్రారంభించవచ్చని విమానయాన మంత్రిత్వ శాఖ ఆయా ఎయిర్లైన్స్కు అనుమతులు ఇచ్చింది.