నారాయణఖేడ్/కల్హేర్/నాగల్గిద్ద, మే 28 : ప్రభుత్వ ఆదేశాల మేరకు సూపర్ స్ప్రెడర్లుగా గుర్తించిన జర్నలిస్టులు, రేషన్ డీలర్లు, పెట్రోల్ బంక్ల సిబ్బంది, ఫర్టిలైజర్ దుకాణాల నిర్వాహకులకు శుక్రవారం వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. నారాయణఖేడ్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్, సిర్గాపూర్, మనూరులలో ముమ్మరంగా వ్యాక్సినేషన్ చేపట్టారు. నారాయణఖేడ్ మండలం నిజాంపేట్ పీహెచ్సీలో 230 మందికి వ్యాక్సినేషన్ చేయాల్సి ఉండగా తొలి రోజు 82 మందికి టీకాలు ఇచ్చినట్లు స్థానిక వైద్యాధికారి నవీన్కుమార్ తెలిపారు. అదే విధంగా సిర్గాపూర్, కంగ్టి, కల్హేర్ మండలాలకు సంబంధించి సిర్గాపూర్ పీహెచ్సీలో 198 మందికి గాను 84 మందికి టీకాలు వేశారు. మనూరు, నాగల్గిద్ద మండలానికి సంబంధించి మనూరు పీహెచ్సీలో 116 మందికి గాను 49 మందికి వ్యాక్సిన్ చేసినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఆర్డీవో అంబాదాస్ రాజేశ్వర్ మనూరు, సిర్గాపూర్ పీహెచ్సీలను సందర్శించి వ్యాక్సినేషన్ను పర్యవేక్షించారు.
కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం చర్యలు
కరోనాను కట్టడి చేయడంతో పాటు వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే సిర్గాపూర్ పీహెచ్సీని సందర్శించి వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. నిత్యం జనం మధ్య ఉండే వర్గాలను సూపర్ స్ప్రెడర్లుగా గుర్తించి వ్యాక్సినేషన్ వేస్తున్నట్లు తెలిపారు.
ప్రణాళికలతో వ్యాక్సినేషన్ : ఎమ్మెల్యే క్రాంతికిరణ్
అందోల్, మే 28: రాష్ట్ర ప్రభుత్వం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో పనిచేసే ప్రతి ఒక్కరికీ ముందస్తుగా వ్యాక్సిన్ వేసేందుకు తగిన ప్రణాళిక రూపొందించిందని, అందులో భాగంగా వారిని సూపర్ స్ప్రెడర్లుగా గుర్తించి వ్యాక్సిన్లు వేస్తున్నారని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. శుక్రవారం నియోజకవర్గం వ్యాప్తంగా ఆయా మండల కేంద్రాల్లో జర్నలిస్టులతో పాటు రేషన్, పెట్రో, ఫర్టిలైజర్ డీలర్లకు కొవిడ్ వ్యాక్సిన్లు వేశారు. మండల కేంద్రం వట్పల్లిలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అందోల్-జోగిపేట మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని తహసీల్దార్ అశోక్కుమార్, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, ఏఎంసీ చైర్మన్ మల్లికార్జున్ గుప్తా పరిశీలించి తగిన ఏర్పాట్లు చేశారు. హత్నూర, పుల్కల్, మునిపల్లి, రాయికోడ్ మండల్లాలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో స్థానిక ప్రజా ప్రజాప్రతినిధులు, అధికారులు పరిశీలించారు.
బాల్క సుమన్ తండ్రి మృతిపట్ల సంతాపం
ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తండ్రి సురేశ్ మృతి పట్ల ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ సంతాపం తెలియజేశారు. సురేశ్ అకాల మరణం తనను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసిందన్నారు. ఎమ్మెల్యే వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
కొవిడ్ వ్యాక్సిన్ నిర్భయంగా తీసుకోవాలి
-డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ శంకర్
న్యాల్కల్, మే 28 : కొవిడ్ వ్యాక్సిన్ పట్ల ఎలాంటి భయందోళనలు, అపోహలు అవసరం లేదని, నిర్భయంగా వ్యాక్సిన్ను తీసుకోవాలని జిల్లా డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ శంకర్, జహీరాబాద్ డివిజన్ రెవెన్యూ అధికారి రమేశ్బాబు అన్నారు.మండలంలోని మిర్జాపూర్(బి) ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాయికోడ్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాలకు చెందిన సూపర్ స్పైడర్లకు కొవిడ్ వ్యాక్సిన్ తీస్తున్న తీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వైరస్ సోకకుండా ప్రతి ఒక్కరూ మాస్కులను ధరించి, భౌతిక దూరం పాటించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాధాబాయి, నయాబ్ తహసీల్దార్ విజయ్కుమార్, హద్నూర ఎస్ఐ విజయ్రావు, స్థానిక వైద్యాధికారి ప్రశాంతి, గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి, హద్నూర్ పీఏసీఎస్ చైర్మన్ జగన్నాథ్రెడ్డి వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలి
జహీరాబాద్, మే 28 : కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా వేసుకోవాలని జహీరాబాద్ ఆర్డీవో రమేశ్బాబు తెలిపారు. శుక్రవారం జహీరాబాద్ ప్రభుత్వ డీగ్రీ కళాశాలలో సూపర్ స్ప్రెడర్లకు కొవిడ్ టీకాలు వేశారు. కేంద్రాన్ని ఆర్డీవో పరిశీలించారు. కార్యక్రమంలో జహీరాబాద్ తహసీల్దార్ నాగేశ్వర్రావు, నయాబ్ తహసీల్దార్ కిరణ్కుమార్ తదితరులు ఉన్నారు.
దిగ్వాల్లో విజయవంతంగా వ్యాక్సినేషన్
కోహీర్, మే 28 : దిగ్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జర్నలిస్టులతో పాటు 150 మంది సూపర్ స్ప్రెడర్లకు టీకా వేయాలని లక్ష్యం ఉండగా 50 మందికి వేశారు. ఆర్డీవో రమేశ్బాబు, తహసీల్దార్ కిషన్, తదితరులు టీకా పంపిణీని పరిశీలించారు. మండల వైద్యాధికారి డా.రాజ్కుమార్ నుంచి వారు వివరాలు సేకరించారు.