ముంబై : ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా పేరొందిన ముంబైలోని ధారావి ఒకప్పుడు కరోనా హాట్ స్పాట్ గా మారింది. మహమ్మారి కోరల్లో నలిగిన ధారావిలో గడిచిన 24 గంటల్లో కేవలం మూడు తాజా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని బ్రుహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) వర్గాలు వెల్లడించాయి. దేశాన్ని కరోనా సెకండ్ వేవ్ వణికిస్తున్నప్పటి నుంచి ధారావిలో అతితక్కువ కేసులు నమోదవడం ఇదే తొలిసారి.
ముంబైలోనే అత్యంత ఇరుకైన ప్రాంతమైన ధారావిలో ఎనిమిది లక్షలకు పైగా జనాభా ఉంది. 6798 యాక్టివ్ కేసులకు గాను ఇప్పటికి 6382 మంది కోలుకోగా మిగిలిన వారు చికిత్స పొందుతున్నారు. విస్తారమైన జనాభా కలిగిన ధారావిలో సోమవారం 16, మంగళవారం కేవలం 7 కేసులే వెలుగుచూడటంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. తాజాగా మూడు కేసులే నమోదవడంతో మహమ్మారి తగ్గుముఖం పట్టిందని అంచనా వేస్తున్నారు.
కరోనా తొలివేవ్ దేశాన్ని వణికించిన సమయంలో ధారావిలో గత ఏడాది ఏప్రిల్ 1న తొలి కొవిడ్ కేసు నమోదవడం, తొలి మరణం చోటుచేసుకున్నాయి. మే 3న అప్పట్లో అత్యధికంగా 94 కేసులు నమోదవడంతో మురికివాడలో మహమ్మారి కట్టడి సవాల్ గా మారి బీఎంసీ అధికారులు తలలు పట్టుకున్నారు.
ఆపై స్ధానికుల సహకారం, అధికారుల చొరవతో మహమ్మారిని దీటుగా నియంత్రించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వం కొవిడ్-19పై ధారావి పోరాటాన్ని కొనియాడారు. సెకండ్ వేవ్ లోనూ అదే స్ఫూర్తితో ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ కరోనా మహమ్మారిని విజయవంతంగా నిలువరించే దిశగా సాగుతోంది.