నకిలీ పత్తి విత్తనాలను అరికట్టేందుకు జిల్లా వ్యవసాయ శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. నాణ్యతలేని, నిషేధిత విత్తనాల విక్రయంపై ఉక్కుపాదం మోపేందుకు సన్నద్ధమవుతున్నది. అందుకోసం జిల్లాలో రెండు ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలతో పాటు అంతర్గత స్కాడ్లను ఏర్పాటు చేసింది. ఇందులో వ్యవసాయ, పోలీస్, విత్తన ధ్రువీకరణ అధికారులను సభ్యులగా నియమించింది. వీరు జిల్లా అంతటా విత్తన దుకాణాలపై ఆకస్మిక దాడులు చేయనున్నారు. నాసిరకం, నిషేధించిన హెచ్టీ పత్తి విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారులు హెచ్చరిస్తున్నారు. అనుమతి పొందిన డీలర్ల వద్దనే రైతులు విత్తనాలను కొనుగోలు చేయాలని, బిల్లుపై నెంబర్, విత్తన రకం, గడువు తేదీ, డీలర్ సంతకం, రైతు సంతకం ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. విత్తనాల కొనుగోలుపై ఎలాంటి సందేహాలున్నా స్థానిక వ్యవసాయాధికారులను సంప్రదించాలని కోరుతున్నారు.
రంగారెడ్డి, మే 22, (నమస్తే తెలంగాణ): నకిలీ పత్తి విత్తనాలపై జిల్లా వ్యవసాయ శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. పత్తి పంటను సాగు చేసే ఏ ఒక్క రైతుకూ నష్టం జరుగకుండా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ప్రతి ఏటా నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తూ పట్టుబడుతుండడంతో అధికారులు ఈ ఏడాది ముందు నుంచే అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఓవైపు నకిలీ విత్తనాలతో మోసపోకుండా మరోవైపు అనుమతి పొందిన డీలర్ల ద్వారానే రైతులు పత్తి విత్తనాలను కొనుగోలు చేసే విధంగా జిల్లా వ్యవసాయ శాఖ యంత్రాంగం రైతులకు అవగాహన కల్పిస్తున్నది. అంతేకాకుండా నకిలీ పత్తి విత్తనాల విక్రయాన్ని అడ్డుకునేందుకుగాను రెండు ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలను కూడా ఏర్పాటు చేసింది. ఈ బృందాలు జిల్లా అంతటా పర్యటించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నాయి. టాస్క్ఫోర్స్ బృందంలో వ్యవసాయ శాఖ అధికారితోపాటు పోలీసు, విత్తన ధ్రువీకరణ అధికారులను సభ్యులుగా నియమించారు. నకిలీ పత్తి విత్తనాలను నిరోధించేందుకు టాస్క్ఫోర్స్ బృందాలతోపాటు అంతర్గత స్కాడ్లను కూడా వ్యవసాయ శాఖ నియమించింది. వీరు విత్తన దుకాణాలు, రవాణా చేస్తున్న వాహనాలు, అనధికారికంగా విత్తనాలను నిల్వ ఉంచిన ప్రదేశాలపై ఎప్పటికప్పుడు దృష్టి సారిస్తూ నకిలీ విత్తనాల విక్రయాన్ని అడ్డుకోనున్నారు. అనుమతిలేని హెచ్టీ పత్తి విత్తనాలను విక్రయించినా నేరమేనని.. సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. కేవలం వ్యవసాయ శాఖ ద్వారా అనుమతి పొందిన అధికారిక డీలర్ల వద్దనే విత్తనాలను కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. ఈ ఏడాది పత్తి విత్తనాల ధరకు సంబంధించి బీటీ పత్తి విత్తనాల గరిష్ట ధర బీటీ-1 రకం ధరను రూ.635, బీటీ-2 రకం ధరను రూ.767లుగా ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు జిల్లాలో గతేడాది 2.73 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగుకాగా, ఈ ఏడాది 3 లక్షల ఎకరాల్లో సాగవుతుందని జిల్లా వ్యవసాయ అధికారులు అంచనా వేశారు.
అధీకృత డీలర్ల నుంచే కొనుగోలు..
పత్తితోపాటు ఇతర పంటల విత్తనాలు కొనుగోలు చేసే ముందు రైతులు తగు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. నకిలీ విత్తనాలతో మోసపోవద్దని వ్యవసాయ శాఖ అనుమతిచ్చిన అధీకృత డీలర్ల వద్దనే కొనుగోలు చేయాలని చెబుతున్నారు. అలాగనే విత్తనాలను కొనుగోలు చేసినప్పుడు బిల్లుపై నెంబర్, విత్తన రకం, గడువు తేదీ, డీలర్ సంతకం, రైతు సంతకం ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. లూజుగా ఉన్న సంచులు, పగిలిన ప్యాకెట్లు, తెరిచిన డబ్బాల నుంచి విత్తనాలను కొనుగోలు చేయవద్దని, కొనుగోలు చేసిన విత్తన ప్యాకెట్ సీల్ ఉందా లేదనేది చూసుకోవాలంటున్నారు. బిల్లులను పంటకాలం పూర్తయ్యే వరకు తమ వద్దనే భద్రపర్చుకోవాలని, అరువు పద్ధతిలో విత్తనాలను కొనుగోలు చేసినా బిల్లులు తీసుకోవాలని చెబుతున్నారు. విత్తనాలను తీసుకున్న వెంటనే మొలక శాతం చూడాలని, మొలక శాతం సంతృప్తికరంగా ఉంటేనే విత్తనాలను వాడాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు.
నకిలీ విత్తనాలను విక్రయిస్తే చర్యలు..
నకిలీ విత్తనాలను విక్రయించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయాధికారులు హెచ్చరిస్తున్నారు.రైతులకు నకిలీ విత్తనాలను అంటగట్టేందుకు దళారులు సిద్ధంగా ఉన్నారు కాబట్టి రైతులు పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే విత్తనాలను కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. కలుపు మందును తట్టుకునే హెచ్టీ పత్తి రకం పంట సాగును ప్రభుత్వం నిషేధించిన దృష్ట్యా ఆ విత్తనాలను కొనుగోలు చేయరాదంటున్నారు. పత్తి విత్తనాల కొనుగోలుపై ఏమైనా సందేహాలుంటే స్థానిక వ్యవసాయాధికారిని సంప్రదించవచ్చని సూచిస్తున్నారు. గతేడాది జిల్లాలో 7 చోట్ల టాస్క్ఫోర్స్ బృందాలను నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని అబ్దుల్లాపూర్మెట్లో-2, హయత్నగర్-1, కందుకూరు-1, గండిపేట్-1, ఫరూఖ్నగర్లో రెండు చోట్ల క్రిమినల్ కేసులను నమోదు చేశారు. రూ.99.64 లక్షలు విలువ చేసే 63.5 క్వింటాళ్ల లూజు పత్తి విత్తనాలు, రూ.7.78 లక్షల విలువ చేసే 1048 పత్తి విత్తనాల ప్యాకెట్లు, 4.8 క్వింటాళ్ల నకిలీ కంది విత్తనాలను టాస్క్ఫోర్స్ బృందాలు గతేడాది స్వాధీనం చేసుకున్నారు.
3 లక్షల ఎకరాల్లో పత్తి సాగు..
జిల్లాలో ఈ ఏడాది పత్తి పంట సాగు అవుతుందని జిల్లా వ్యవసాయాధికారులు అంచనా వేశారు. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 5.50 లక్షల ఎకరాల్లో ఆయా పంటలు సాగవుతాయని అధికారులు ప్రణాళికను రూపొందించారు. అయితే అత్యధికంగా పత్తి పంట సాగవుతుందని అంచనా వేశారు. పత్తి 3 లక్షల ఎకరాల్లో, కందులు లక్ష ఎకరాల్లో, మొక్కజొన్న-62,328, వరి-55 వేలు, జొన్న-30 వేలు, పెసలు-600, మినుములు-150, వేరుశనగ-70, ఆముదం-500, చెరుకు-80, ఇతర పంటలు 4063 ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేశారు.
అంతర్గత స్కాడ్స్ను నియమించాం..
జిల్లా అంతటా నకిలీ విత్తనాలు విక్రయించకుండా గట్టి నిఘా పెట్టాం. నకిలీ విత్తనాలతో ఏ ఒక్క రైతు నష్టపోకుండా చర్యలు చేపట్టాం. జిల్లాలో రెండు టాస్క్ఫోర్స్ బృందాలతో పాటు అంతర్గత స్కాడ్స్ను నియమించాం. విత్తనాలను కొనుగోలులో ఏమైనా సందేహాముంటే స్థానిక వ్యవసాయాధికారులను సంప్రదించి విత్తనాలను కొనుగోలు చేయాలి. ఈ ఏడాది ప్రధాన పంటగా పత్తి పంట సాగవుతుందని అంచనా వేశాం.
గీతారెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి