సిటీబ్యూరో, మే 21(నమస్తే తెలంగాణ): గతేడాది కలర్ ప్రిడిక్షన్ గేమ్తో దేశవ్యాప్తంగా లక్షలాది మందిని మోసం చేసిన చైనా మూలాలున్న కంపెనీలు, ఈ సారి మరో స్కెచ్తో ఆన్లైన్ మార్కెట్లోకి వచ్చినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. రమ్మీ, ఆన్లైన్లో తీన్పత్తి ఇలా ఎన్నో గేమ్స్ ఇప్పుడు ఆన్లైన్ మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. ఇటీవల తీన్పత్తి పేరుతో ప్రకటనలు రావడంతో హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. కాగా, నగరానికి చెందిన ఓ సినీ నిర్మాత ఫొటోను కూడా ఈ యాడ్లలో వాడినట్లు ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాగా, తీన్పత్తి గేమ్స్ మూలాలు ఢిల్లీ నుంచే ఉన్నట్లు, వాటి వెనుక చైనీయులే ఉన్నారని పోలీసులు గుర్తించారు. తీన్పత్తి నిర్వహించే సంస్థలు గూగుల్తో పాటు ఆయా వెబ్సైట్ల ద్వారా యాడ్స్ను ఇస్తున్నాయి. గూగుల్, ఫేస్బుక్ ఇతర సోషల్మీడియాలో కూడా ఈ ప్రకటనలు వస్తున్నాయి. ఆయా సంస్థలు డబ్బులు ఎక్కువగా చెల్లించడం వల్ల గేమింగ్ యాప్లు, వెబ్సైట్లలో ఎక్కువ సేపు తీన్పత్తికి సంబంధించిన ప్రకటనలు కన్పిస్తున్నాయని సైబర్క్రైమ్స్ ఏసీపీ ప్రసాద్ తెలిపారు. దీనిపై లోతైన దర్యాప్తు జరుపాల్సి ఉందని, రాష్ట్రంలో ఆన్లైన్ రమ్మీ, తీన్పత్తిపై నిషేధం ఉందన్నారు.