ఘట్కేసర్, మే 21: పోచారం మున్సిపాలిటీలోని రాష్ట్రీయ విద్యాకేంద్రం కొవిడ్ ఐసొలేషన్ కేంద్రంలో చికిత్స పొంది ఆరోగ్యంగా శుక్రవారం బాధితులు ఇండ్లకు చేరుకున్నారు. దాదాపు 22 రోజుల పాటు కొవిడ్ చికిత్స అందించిన కేంద్రం నిర్వాహకులు 21 మందిని క్షేమంగా ఇండ్లకు పంపారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో నివాసం ఉండే కొవిడ్ బాధితులకు సెంటర్ నిర్వాహకులు ప్రతిరోజూ పౌష్టికాహారంతో పాటు బలాన్ని ఇచ్చే ఫుడ్ను అందజేశారు. నిపుణులైన డాక్టర్లు ప్రతి రోజూ పరీక్షలు నిర్వహించి వారికి తగిన మందులు, సలహాలు, సూచనలు అందజేశారు. దీంతో త్వరగా కొలుకున్న వారు క్షేమంగా ఇండ్లకు చేరుకోవడంతో కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొవిడ్ సెంటర్ నిర్వాహకుడు రాష్ట్రీయ విద్యా కేంద్రం, సేవా భారతి ప్రతినిధి మహేశ్ మాట్లాడుతూ.. కొవిడ్ సెంటర్లో 260 బెడ్లు, 10ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నామన్నారు.