లక్నో : ప్రకృతి ప్రేమికులను ముగ్దులను చేసే సుందర దృశ్యం మరోసారి సాక్షాత్కారమైంది. మంచు దుప్పటి కప్పుకున్న హిమాలయ శిఖరాలు ఈ ఏడాది వరుసగా రెండోసారి సహారాన్పూర్ పట్టణవాసులకు దర్శనమిచ్చి కనువిందు చేశాయి. ఉత్తరప్రదేశ్లోని సహారాన్పూర్ పట్టణం నుంచి ఈ ఏడాది మరోసారి హిమాలయ శిఖరాలు కనిపించాయి. 30 నుంచి 40 ఏండ్లకు ఒకసారి ఇలాంటి దృశ్యం ఆవిష్కృతమవుతుందని స్థానికులు అంటున్నారు. సహారాన్పూర్ నుంచి అప్పర్ హిమాలయాలకు దాదాపు 150 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
కొవిడ్ నిబంధనల కారణంగా వాతావరణంలో కాలుష్యం తగ్గడం, తుఫాన్ తౌక్టే ప్రభావంతో ఉత్తర భారతదేశంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మంచు తొలగి హిమాలయ పర్వత శిఖరాలు కనిపించినట్లు అంచనా వేస్తున్నారు. సహారాన్పూర్ పట్టణానికి చెందిన ఇద్దరు డాక్టర్లు, ఏ ప్రభుత్వ ఉద్యోగి ఈ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించారు. వీటిలో వైద్యుడు వివేక్ బెనర్జీ తీసిన ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నది. ఫొటోగ్రఫీపై మంచి అభిరుచి ఉన్న యూపీ క్యాడర్కు చెందిన సంజయ్ కుమార్ అనే ఓ ఐఏఎస్ అధికారి సైతం ఈ ఫొటోను తన ట్విట్టర్లో షేర్ చేసి అద్భుత దృశ్యమంటూ రాసుకొచ్చారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.