హుజూరాబాద్, మే 19: తాము అమ్ముడు పోయే రకంకాదని, నిఖార్సయిన తెలంగాణవాదులమని, ప్రాణం ఉన్నంతవరకు టీఆర్ఎస్లోనే కొనసాగుతామని ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్ స్పష్టంచేశారు. బుధవారం హుజూరాబాద్లోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటల రాజేందర్ ప్రవర్తన సరిగాలేకనే విభేదించామని, కన్నతల్లి లాంటి పార్టీని కించపరిచేలా మాట్లాడం సబబుకాదని హితవుపలికారు.
గొర్రెల మందపై తోడేళ్లు పడుతున్నారని ఈటల మాట్లాడటం సరికాదని, మొదటి నుంచీ పార్టీలోనే ఉన్నామని, ఇకముందు కూడా కొనసాగుతామని చెప్పారు. రాష్ట్రంలో ముఖ్యనాయకులలో ఒకరుగా ఉండే ఈటల కేవలం ఆయన స్వయంకృతాపరాధంతోనే అట్టడుగుస్థాయికి పడిపోయారని అన్నారు. సీఎం కేసీఆర్ ఎవరికీ ఇవ్వని ప్రాధాన్యం రాజేందర్కు ఇచ్చారని, దీనికి నిదర్శనమే రైతుబంధు పథకం హుజూరాబాద్ నుంచి ప్రారంభించడమని గుర్తుచేశారు. అందరూ అనుకుంటున్నట్టు ఈటలకు, తనకు మధ్య ఎలాంటి విభేదాల్లేవని చెప్పేందుకు సీఎం కేసీఆర్ సర్వప్రయత్నాలు చేస్తే, పదేపదే పార్టీని, ప్రభుత్వ పథకాలను విమర్శించడం దేనికి సంకేతమని మండిపడ్డారు.
కేసీఆర్ అనే గొప్పవ్యక్తి ఈటలకు అన్నీ ఎక్కువేచేశారని, కేవలం అధినేత కేసీఆర్ చలవతో, పార్టీతోనే ఎన్నో ఉన్నతమైన పదవులు వచ్చాయన్న సంగతి ఎందుకు మరచిపోయారో ఈటలకే తెలియాలని అన్నారు. ‘ఒకసారి కేసీఆర్ కలవడానికి సమయం ఇవ్వలేదని బాధ పడుతున్నావు కానీ, మాకు కూడా మీరు చేసింది ఏమిటి’ అని ప్రశ్నించారు. ‘మీ కోసం అహర్నిషలు పనిచేసిన మేము మిమ్మల్ని కలవడానికి వస్తే కనీసం గేటు కూడా దాటనివ్వలేదని, ఆ సమయంలో మేము చాలా బాధపడిన సంగతి మాకు ఇంకా గుర్తుంది’ అని పేర్కొన్నారు. తనలాంటి వాళ్లకు ఈటల చేసిందేమీ లేదని, కనీసం ఆయన రూపాయి బిళ్ల కూడా ఎరుగమని స్పష్టంచేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ గందె రాధిక, కొలిపాక నిర్మల, కౌన్సిలర్లు తాళ్లపల్లి శ్రీనివాస్, కల్లెపల్లి రమాదేవి, ముత్యం రాజు, మారేపల్లి సుశీల, గోస్కుల రాజు, మక్కపల్లి కుమార్, మార్కెట్ చైర్మన్ రమా యాదగిరినాయక్ తదితరులు పాల్గొన్నారు.