కాన్బెరా: ప్రపంచం కరోనాతో సతమతం అవుతుంటే ఆస్ట్రేలియా ఎలకలతో యుద్ధం చేస్తున్నది. న్యూసౌత్వేల్స్, క్వీన్స్ల్యాండ్ రాష్ట్రాల్లో ఎలుకలు పుట్లకొద్దిగా పుట్టుకువస్తున్నాయి. స్థానికులను ఎవరిని కదిలించినా యుద్ధంలో సేనానిలా మాట్లాడుతున్నారు. తెలివైన ఎత్తుగడలు, శత్రువును ముగ్గులోకి దించడం, బుడ్డ జంతువులను తుదముట్టించడం గురించి వివరిస్తున్నారు. కానీ 6 నెలలు గడిచినా సమస్య తగ్గుముఖం పట్టలేదు. శత్రువును ఓడించడం మాట దేవుడెరుగు ఇప్పుడు ఎలుకలు ఆ ప్రాంతాలను మబ్బుల్లా కమ్మేస్తున్నాయి. గాయం మానకపోగా నిరంతరం కెలుకుతున్నట్టుగా ఉంది. టన్నుల కొద్దీ పాయిజన్ ఉపయోగించినా మూషిక సంతానం అంతరించలేదు. స్థానికుల్లో ఒకరకమైన నిర్వేదం కనిపిస్తున్నది. మానసికంగా కృంగిపోతున్నారు. ఈ ఎలుకల బెడద అనేది అనుభవిస్తేగానీ తెలియదు. ఆ దుర్భరమైన వాసన.. కొరికేసిన ఫర్నిచర్, వైర్లు, స్విచ్ బోర్డులు, ఏసీల ఇన్సులేషన్లు.. ఇల్లూ, బళ్లూ అన్నీ కూడా ఎలుకల బారిన పడినవే. నిన్నటిదాకా పిల్లలు ఎలుకను చూడగానే చెంగున గెంతేవారు. ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడం లేదు. మొన్నటి గురువారం న్యూసౌత్వేల్స్ రాష్ట్ర ప్రభుత్వం ఎలుకల బెడద నివారణకు 5 కోట్ల డాలర్ల ప్యాకేజీ ప్రకటించింది. కొత్త ఎలుకల విషం కనుగొనడం, రైతులకు ఎలుకల విషం పాకెట్లు ఉచితంగా పంచడం, చిన్న వ్యాపారులకు, గృహస్థులకు ఎలుకల మందు రిబేట్లు ఇస్తున్నారు. కానీ సిడ్నీకి పశ్చిమంగా 500 కి.మీ. దూరంలో ఉండే తాలింబాలో నివసించే లూయిజ్ మెక్కేబ్ లాంటివారు సాయం చాలా ఆలస్యంగా అందినట్టేనని అంటున్నారు. ఎలుకల మందు ఇస్తున్నారు సరే.. ఇదివ రకే జరిగిన నష్టం ఎవరు పూరిస్తారని ఆమె అంటున్నారు. నాలుగు రోజులు ఊరికెళ్లి తిరిగొచ్చి తలుపు తీస్తే ఇంటినిండా వేల ఎలుకలు అటూఇటూ పరుగెత్తుతూ కనిపించాయి మరి. కొత్త తివాచీ చీలికలు పేలికలైపోయింది. కిందనున్న కలప గచ్చు కూడా రంద్రాలతో నిండిపోయింది. ఈ బెడద ఎప్పుడు ఆగిపోతుందా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.