మియాపూర్ , మే 9 : రాష్ట్రంలో కరోనా సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజా సంక్షేమాన్ని ప్రభుత్వం నిరంతరాయంగా కొనసాగిస్తున్నదని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజవకవర్గంలోని వివిధ డివిజన్లకు చెందిన 20 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి పథకం కింద మంజూరైన రూ. 9.18 లక్షలను కార్పొరేటర్ దొడ్ల వెంకటేశ్గౌడ్, నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్లతో కలిసి విప్ గాంధీ ఆదివారం వివేకానందనగర్లోని తన నివాసంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక స్తోమత లేని పేదలను ప్రభుత్వం ఆదుకుంటున్నదని అన్నారు. పేదలకు, అభాగ్యులకు సీఎం సహాయ నిధి అండగా నిలుస్తున్నదని విప్ గాంధీ స్ఫష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, పార్టీ నేతలు రఘునాథ్రెడ్డి, శ్రీనివాసయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
చందానగర్ సర్కిల్ వ్యాప్తంగా పారిశుధ్య నిర్వహణ, ఇంటింటి సర్వే, కరోనా ఐసొలేషన్ కేంద్రాలు, వ్యాక్సినేషన్ , కొవిడ్ పరీక్షలకు సంబంధించిన అంశాలపై సర్కిల్ వైద్యాధికారి డాక్టర్ కార్తీక్తో విప్ అరెకపూడి గాంధీ తన నివాసంలో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. పారిశుధ్య నిర్వహణ చర్యలను అత్యంత పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో శానిటేషన్ను సమర్థంగా నిర్వహించాలన్నారు.