బోటింగ్ హబ్గా మారుతున్న రాష్ట్రం!
వాటర్ స్పోర్ట్స్తో టూరిజం కొత్త పుంతలు
పర్యాటక అభివృద్ధిపై సర్కారు ప్రత్యేక దృష్టి
ఆకట్టుకుంటున్న అలీసాగర్, లక్నవరం, సోమశిల
బోటింగ్ చేద్దామనుకుంటున్నారా..? కాసేపు వాటర్ స్పోర్ట్స్తో సంతోషంగా గడపాలనుకుంటున్నారా? నీటిలో కదిలే రెస్టారెంట్లో కూర్చొని విందు భోజనం చేయాలనుకుంటున్నారా?.. అయితే ఇక రెడీకండి. తెలంగాణ బోటింగ్ హబ్గా మారనున్నది. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటకులను మరింత ఆకట్టుకునేందుకు టూరిజం ప్రాంతాల్లో సకల సదుపాయాలు కల్పిస్తున్నది. కాళేశ్వరం నీళ్లతో నిండిన జలాశయాలకు మరింత పర్యాటక కళను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.
హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎకో టూరిజం కొత్త పుంతలు తొక్కుతున్నది. హైదరాబాద్కే పరిమితం కాకుండా.. అన్ని జిల్లాల్లో పర్యాటక అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. కాళేశ్వరం ప్రాజెక్టుతో నిండిన జలాశయాల్లో బోటింగ్, వాటర్ స్పోర్ట్స్కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. సిద్దిపేట జిల్లా కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్, వరంగల్లోని వడ్డేపల్లి చెరువులో 12 సోలార్బోట్లను అందుబాటులోకి తెస్తున్నారు. ఇందులో 150 సీట్ల సామర్థ్యం గల ఒక క్రూజ్బోట్, 80 సీట్ల సామర్థ్యంతో రెండు ఫ్లోటింగ్ రెస్టారెంట్ బోట్లు, 25 సీట్లతో సాధారణ బోటు, నాలుగు స్పీడ్ బోట్లతోపాటు పెడల్ బోట్లు ఉన్నాయి. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది. సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు, రంగనాయకసాగర్, మల్లన్న సాగర్లలో బోటింగ్, వాటర్ స్పోర్ట్స్ సదుపాయాలు కల్పించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో సోమశిల, లక్నవరం, అలీసాగర్ ఎకో టూరిజం కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి.
అలీసాగర్లో క్రూజ్, స్పీడ్ బోట్లు
నిజాం పాలనలో 1932 సంవత్సరంలో అలీసాగర్ తాగునీటి రిజర్వాయర్, ఉద్యానవనం నిర్మించారు. కాలక్రమంలో దీన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఉమ్మడి రాష్ట్రంలో మరింత అధ్వానంగా తయారైంది. 2014లో అలీసాగర్ను సందర్శించిన సీఎం కేసీఆర్ పూర్వవైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. రూ.5 కోట్లతో ఇక్కడి గోల్బంగ్లా స్థానంలో రెస్టారెంట్, గెస్ట్హౌజ్ నిర్మించారు. గుట్టపైకి వెళ్లే రోడ్డు విస్తరణతోపాటు రోడ్డుకు ఇరువైపులా స్టీల్ రెయిలింగ్ ఏర్పాటు చేశారు. చెరువు మధ్యలో ఐలాండ్ ఏర్పాటుచేసి అక్కడినుంచి గుట్టమీదకు రోప్వే నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో క్రూజ్, స్పీడ్ బోట్లను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు.
సోమశిల.. కళకళ
కృష్ణానది పరవళ్లు.. చుట్టూ పచ్చదనం.. పాపికొండలను మరిపించే నల్లమల కొండల ప్రకృతి సోయగాలతో రాష్ట్ర పర్యాటకరంగానికే సోమశిల తలమానికంగా నిలుస్తున్నది. ప్రభుత్వం రూ.20.86 కోట్లు వెచ్చించి అద్భుత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దింది. ఏడాది కిందట రూ.2.95 కోట్లతో సోమశిల నుంచి శ్రీశైలానికి 100 మంది ప్రయాణించేలా లాంచీని అందుబాటులోకి తెచ్చింది. వాటర్స్పోర్ట్స్లో భాగంగా నాలుగుసీట్ల సామర్థ్యం ఉన్న ఆరు స్పీడ్ బోట్లు, ఎనిమిది సీట్ల సామర్థ్యం గల నాలుగు స్పీడ్ బోట్లను ప్రారంభించింది. రూ.7.84 కోట్లతో స్థానికంగా సోలార్ లైటింగ్ను ఏర్పాటుచేసింది. నల్లమల అడవుల్లో ట్రెక్కింగ్, పర్యాటకుల వసతి కోసం ఐదు బ్లాకుల్లో కాటేజీ సదుపాయాలు కల్పించింది. హైదరాబాద్కు 155 కిలోమీటర్ల దూరంలోని నాగర్కర్నూల్ జిల్లాలో కృష్ణానది ప్రవేశించే ప్రాంతంలో సోమశిల ఉన్నది.
తొలి సస్పెన్షన్ బ్రిడ్జి లక్నవరం
హైదరాబాద్లో దుర్గం చెరువు, సిద్దిపేటలో స్థానిక చెరువుపై సస్పెన్షన్ బ్రిడ్జీలు ఇటీవల ప్రాచుర్యంలోకి వచ్చాయి. కానీ వీటికంటే ముందే జయశంకర్ భూపాలపల్లి జిల్లా లక్నవరం సరస్సుపై 180 మీటర్ల పొడవుతో తొలి సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మించారు. ఏడాది కిందట రూ.5 కోట్లతో మరో వంతెన ఏర్పాటుచేశారు. రెండు వంతెనల మీదుగా సరస్సు మధ్యలోని ద్వీపానికి చేరుకొని, అక్కడి నుంచి బోటింగ్ చేయొచ్చు. ‘వీ’ ఆకారంలో ఉండే రెండు వంతెనలు, చుట్టూ కొండల మధ్య బోటింగ్ చేస్తుంటే కలిగే అనుభూతి మాటల్లో వర్ణించలేం. సరస్సు మధ్యలో ఉండే దీవిపై హరితహోటల్ ఉన్నది. సరస్సు చుట్టుపక్కల దీవుల్లో ఎనిమిది కాటేజీలు ఉన్నాయి. రూ.28 కోట్లతో పర్యాటకశాఖ లక్నవరంలో మరో 24 కాటేజీలను నిర్మించేందుకు సిద్ధమవుతున్నది. వరంగల్ నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉండే లక్నవరం సందర్శనకు టూరిజంశాఖ ప్రత్యేక ప్యాకేజీలు సైతం అందిస్తున్నది.
బోటింగ్ డెస్టినేషన్గా మారుస్తాం..
రాష్ట్రంలో ఎక్కడ వీలైతే అక్కడ బోటింగ్ సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రం బోటింగ్ డెస్టినేషన్గా మారుతుంది. సందర్శకులను ఆకర్షించడమే లక్ష్యంగా సౌకర్యాలు కల్పిస్తున్నాం. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సూచనతో పర్యాటకరంగం అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.