నేరేడుచర్ల, మే 4 : కరోనా సోకినవారు భయాందోళనకు గురికావద్దని, మనోధైర్యమే మందులా పనిచేస్తుందని జిల్లా మలేరియా అధికారి సాహితి అన్నారు. మంగళవారం మండలంలోని పెంచికల్దిన్నె పీహెచ్సీలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 45 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరూ టీకా వేయించుకుంటే కరోనా బారిన పడకుండా ఉండవచ్చన్నారు. జిల్లాలో 45ఏండ్లు పైబడిన వారిలో 50శాతం మందికి టీకాలు వేశామని, మిగిలిన వారికి త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. జలుబు, దగ్గు, జ్వరం తదితర లక్షణాలు ఉంటే వెంటనే స్థానిక పీహెచ్సీకి వెళ్లి టెస్టు చేయించుకోవాలని సూచించారు. అనవసరంగా బయట తిరుగొద్దని, తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే విధిగా మాస్క్ ధరించడంతోపాటు భౌతికదూరం పాటించాలని సూచించారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తరువాత 18ఏండ్లు నిండిన వారికి టీకాలు వేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైద్యాధికారి హరికిషన్, సిబ్బంది వరమ్మ, హరికిషన్, నాగమ్మ, రమేశ్, అరవిందమ్మ, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
మేళ్లచెర్వు పీహెచ్సీలో 120మందికి వ్యాక్సిన్
మేళ్లచెర్వు : స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం 120 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు మండల వైద్యాధికారి ప్రేమ్సింగ్ తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న 45 ఏళ్ల వయస్సు పైబడిన వారికి మాత్రమే ప్రస్తుతం వ్యాక్సిన్ వేస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే 112 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 28 మందికి పాజిటివ్ వచ్చినట్లు చెప్పారు.
నేరేడుచర్ల, పెంచికల్దిన్నెలో 100 మందికి..
నేరేడుచర్ల : నేరేడుచర్ల, పెంచికల్దిన్నె పీహెచ్సీల్లో మంగళవారం 100మందికి టీకాలు, 134మందికి పరీక్షలు చేసినట్లు వైద్యాధికారులు నాగయ్య, హరికిషన్ తెలిపారు. నేరేడుచర్ల పీహెచ్సీలో 80 మందికి టీకాలు, 57 మందికి పరీక్షలు చేయగా, పెంచికల్దిన్నె పీహెచ్సీలో 20మందికి టీకాలు, 77మందికి పరీక్షలు చేసినట్లు చెప్పారు.
చిలుకూరులో 15 మందికి పాజిటివ్
చిలుకూరు : స్థానిక పీహెచ్సీలో మంగళవారం 90 మందికి కరోనా పరీక్షలు చేయగా 15 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి ప్రమోద్కుమార్ తెలిపారు. అలాగే 66 మందికి టీకాలు వేసినట్లు చెప్పారు.
ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలి : జడ్పీటీసీ
హుజూర్నగర్ రూరల్ : ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని జడ్పీటీసీ సైదిరెడ్డి సూచించారు. మంగళవారం మండలంలోని అమరవరంలో ఆయన మాట్లాడారు. కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడంతోపాటు భౌతికదూరం పాటించాలన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.