న్యూఢిల్లీ, మే 4: దేశంలో కార్చిచ్చులా వ్యాపిస్తున్న కరోనా కట్టడికి ఢిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా కీలక సూచనలు చేశారు. పాజిటివిటీ రేటు 10 శాతం దాటిన లేదా దవాఖానల్లో బెడ్లు 60 శాతం నిండిన ప్రాంతాల్లో కఠిన లాక్డౌన్ విధించాలని సూచించారు. ప్రస్తుతం రాష్ర్టాలు విధిస్తున్న నైట్ కర్ఫ్యూలు, వారాంతపు లాక్డౌన్లు వైరస్ను నియంత్రించలేవని, వీటితో పెద్దగా ప్రయోజనమేమీ ఉండదని అభిప్రాయపడ్డారు. వైరస్ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో లాక్డౌన్ విధించడమే ఉత్తమమని చెప్పారు. కేంద్రహోంశాఖ మార్గదర్శకాల్లోనూ దీన్ని ప్రస్తావించారని, అయితే కఠినంగా అమలుచేయడం లేదని పేర్కొన్నారు. ఇంతటి భారీ స్థాయిలో కేసులను ఏ వైద్య వ్యవస్థా తట్టుకోలేదని, వైరస్ కట్టడికి కొంతకాలంపాటు కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నదని స్పష్టంచేశారు. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్డౌన్ విధించాలని, పాజిటివిటీ రేటు తగ్గిన తర్వాత ఆ ప్రాంతాల్లో దశలవారీగా అన్లాక్ ప్రక్రియను ప్రారంభించాలని సూచించారు. అలాగే వైరస్ ఉద్ధృతి అధికంగా ఉన్న ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు ప్రయాణాలపై ఆంక్షలను విధించాలన్నారు. దేశవ్యాప్త లాక్డౌన్పై గులేరియా స్పందిస్తూ.. ప్రజల జీవనోపాధి, వలస కూలీలపై ప్రభావం దృష్ట్యా ఇది పరిష్కార మార్గం కాదని పేర్కొన్నారు. పాజిటివిటీ రేటు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో రోజువారీ కార్యకలాపాలకు అనుమతించవచ్చన్నారు.
కరోనా ఉద్ధృతిని ఆపాలంటే పూర్తి లాక్డౌన్ విధించడం ఒక్కటే ఇప్పుడున్న మార్గమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ సమయంలో పేదలు ఇబ్బందులు పడకుండా కనీస ఆదాయ హామీ పథకం (న్యాయ్) అమలు చేయాలని సూచించారు. మరోవైపు, కరోనా కేసులు పెరిగిపోతుండటంతో బీహార్లో ఈ నెల 15 వరకు లాక్డౌన్ విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.