హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): రష్యా తయారుచేసిన కరోనా టీకా స్పుత్నిక్-వీ వచ్చే నెలలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నది. హైదరాబాదీ దిగ్గజ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఈ టీకాను భారత్లో ఉత్పత్తి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్ ఉద్ధృతంగా కొనసాగుతుండటం, దేశీయంగా టీకా ఉత్పత్తి మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో మొదట రష్యా నుంచి దిగుమతి చేసుకోవాలని నిర్ణయించినట్టు రెడ్డీస్ ల్యాబ్స్ కోచైర్మన్ జీవీ ప్రసాద్ తెలిపారు. మొత్తంగా మే- జూన్ కల్లా కొన్ని లక్షల డోసులను అందుబాటులోకి తేవాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో దేశీయంగా ఉత్పత్తి చేసిన టీకాలు మార్కెట్లోకి వస్తాయని వివరించారు. టీకా ధర ఒక్కో డోస్ గరిష్ఠంగా రూ.750 (పది డాలర్లు) వరకు ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశీయంగా ఉత్పత్తి మొదలైతే ధర కాస్త తగ్గొచ్చని సంస్థ వర్గాలు తెలిపాయి.