కొత్తగూడెం, ఏప్రిల్ 20 : కరోనాపై ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే పరీక్షలు విస్తృతం చేసింది. పాజిటివ్ కేసులు గుర్తించి వారికి ప్రత్యేక చికిత్స అందిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రిల్లో ఆక్సిజన్ బెడ్స్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సెకండ్ వేవ్లో ఇప్పటివరకు 48 వేల మందికి కరోనా పరీక్షలు చేయగా.. 1,724 మందికి పాజిటివ్ వచ్చింది. వీరిలో ఎక్కువ మంది హోంఐసోలేషన్లో ఉన్నారు. కరోనా కేర్ సెంటర్లో 17 మంది, జిల్లా ఆసుపత్రిలో 44 మంది చికిత్స పొందుతున్నారు. జిల్లాలో కొత్తగూడెం, భద్రాచలంలో 2 ఆసుపత్రుల్లో కరోనా చికిత్సలు చేస్తున్నారు. సింగరేణిలో 1, మణుగూరులో 1, ప్రైవేటులో 15 ఆసుపత్రుల్లో బాధితులకు చికిత్సలు అందుతున్నాయి. కొవిడ్ నోడల్ అధికారి డాక్టర్ చేతన్ కలెక్టర్ ఎంవీ రెడ్డి ఆదేశాల మేరకు మరో 500 ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. అవసరమైతే హోటల్స్, వసతి గృహాలు తీసుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. 1400 మంది వైద్యసిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు.
నిర్లక్ష్యానికి మూల్యం
కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తున్నా.. ప్రజల్లో మార్పు రాకపోవడం లేదు. మాస్కు ధరించకుండా విచ్చల విడిగా రోడ్లపై తిరుగుతున్నారు. సెకండ్ వేవ్ ఇలా ఉంటుందని జనానికి తెలిసే లోపే పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ సెకండ్ వేవ్ డేంజర్, గాలి ద్వారా వ్యాపిస్తుందని చెప్పినా ప్రజలు నిర్లక్ష్యం చేశారు. ఫలితంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. మాస్క్లు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని కోరినా వినక పోవడంతో కేసులు పెరగడానికి కారణమైంది. ఇప్పటికే 1,724 మందికి పాజిటివ్ నమోదైంది.
నియంత్రణ చర్యలో ముందస్తు వ్యూహం
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా సర్కారు ముందస్తు వ్యూహం అమలు చేస్తోంది. వైరస్ ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో వైద్యశాఖ పరీక్షల సంఖ్య పెంచింది. రోజూ పీహెచ్సీతోపాటు ఏరియా ఆసుపత్రుల్లో కరోనా పరీక్షలు చేసి పాజిటివ్ వచ్చినవారికి హోంఐసోలేషన్ కిట్స్ ఇచ్చి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సీరియస్గా ఉన్నవారిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. దీంతో జిల్లాలో మరణాల సంఖ్య లేదనే చెప్పాలి. ఇప్పటికే 2,018 మంది పాతవారితో కలిపి హోం ఐసోలేషన్లో ఉన్నట్లు వైద్యశాఖ గుర్తించింది. కేవలం 70 మంద్రి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వైద్యం అందించడంతో ప్రస్తుతం వారంతా ఆరోగ్యంగానే ఉన్నారు.
వ్యాక్సినేషన్లో ముందడుగు
భద్రాద్రి జిల్లాలో ఇప్పటి వరకు 85,353 మందికి టీకాలు వేశారు. రోజుకు 4 వేల మందికిపైగా టీకాలు వేశారు. ప్రస్తుతం టీకా కొరత ఉండడంతో మంగళవారం 1,913 మందికి మాత్రమే వేశారు. మే 1 నుంచి 18 సంత్సరాలు దాటిన వారికీ టీకాలు వేసేందుకు అనుమతి వచ్చింది. వైరస్ తీవ్ర రూపం దాల్చుతుండడంతో ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూ విధించింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరించింది. నైట్ కర్ఫ్యూను పకడ్బందీగా అమలు చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చేవారిపై నిఘా పెంచారు. వారికి పరీక్షలు చేసి అనుమతించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సరిహద్దు చెక్ పోస్టుల వద్ద నిఘా పెంచనున్నారు.
ఏసమయంలోనైనా వైద్యానికి సిద్ధం
కరోనా విజృంభిస్తున్న వేళ వైద్యశాఖ అప్రమత్తంగా ఉంది. కలెక్టర్ ఎంవీ రెడ్డి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చికిత్స అందిస్తున్నాం. ప్రస్తుతం 523 ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి. మరో 500 బెడ్స్ అందుబాటులోకి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. రాత్రి కర్ఫ్యూకు సహకరించాలి.
-డాక్టర్ చేతన్, కొవిడ్ నోడల్ అధికారి