అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కరోనా నివారణ చర్యలపై నేడు సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఏపీ వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ విధించే అవకాశం ఉంది. బహిరంగ ప్రదేశాలతో పాటు రెస్టారెంట్లు, బార్లలో కఠిన ఆంక్షలు అమలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఏపీ సచివాలయంలో కరోనా పాజిటివ్ కేసులు 100కు పైగా నమోదు అయ్యాయి. కరోనాతో ఇప్పటికే నలుగురు సచివాలయ ఉద్యోగులు మరణించారు. ఇందులో ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఇక తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించే అవకాశం ఉంది. జలుబు, జ్వరం, దగ్గుతో బాధపడే భక్తులు తిరుమలకు రావొద్దని టీటీడీ సూచించింది. ప్రత్యేక దర్శనం టికెట్లు బుక్ చేసుకున్నవారికి 90 రోజుల వరకు అనుమతిస్తామని టీటీడీ తెలిపింది.
ఏపీలో కొత్తగా 6,582 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,62,037కు చేరింది. అందులో 9,09,941 మంది కోలుకొని డిశ్చార్జి కాగా, 44,686 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 22 మంది మృతి చెందారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 7,410కి చేరింది.