ఆక్లాండ్: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో సంబరాలు నెలకొన్నాయి. రెండు దేశాల విమానాశ్రయాల్లో భావోద్వేగ సన్నివేశాలు దర్శనమిచ్చాయి. కరోనా వైరస్ విజృంభన నేపథ్యంలో గత ఏడాది విధించిన ప్రయాణ ఆంక్షలను ఎత్తివేశారు. దీంతో సోమవారం రోజున రెండు దేశాల మధ్య ప్రజలు వేల సంఖ్యలో ప్రయాణించారు. న్యూజిలాండ్లోని ఆక్లాండ్ విమానాశ్రయంలో భావోద్వేగ దృశ్యాలు కనిపించాయి. న్యూజిలాండ్కు దాదాపు ఏడాదిన్నర కాలం తర్వాత తొలిసారి ఆస్ట్రేలియన్లు ప్రయాణించారు. క్వారెంటైన్ ఆంక్షలు లేకుండా ప్రయాణం చేయడం ఇదే తొలిసారి.
రెండు దేశాలు కోవిడ్ నియంత్రణ కోసం తీవ్రంగా కృషి చేశాయి. కఠిన ఆంక్షలతో ఇన్ఫెక్షన్ రేటును అదుపులో ఉంచాయి. ఆస్ట్రేలియాలో అనేక విమానాశ్రయాలు కివీస్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. తమ స్వంతవారిని చూసుకునే ఆశతో వెళ్తున్న వాళ్లంతా ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. గత ఏడాది మార్చిలో రెండు దేశాలు సరిహద్దుల్ని మూసివేశాయి. ఒకవేళ ప్రయాణం చేయాలనుకున్నవారు క్వారెంటైన్ కావాలన్న నియమావళి విధించారు. అయితే గత అక్టోబర్ నుంచి న్యూజిలాండ్ ప్రయాణికులను మాత్రం క్వారెంటైన్ లేకుండా ఆస్ట్రేలియాలోకి అనుమతి ఇచ్చారు.