రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో సిటీ బస్సుల్లో ప్రయాణించే వారు మహమ్మారి బారిన పడకుండా ఆర్టీసీ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అన్ని బస్సులను శానిటైజ్ చేస్తున్నారు. ఇందుకోసం అన్ని డిపోల్లో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాక ప్రయాణికుల కోసం శానిటైజర్ను అందుబాటులో ఉంచుతున్నారు. ప్రయాణికులు భౌతిక దూరంతో పాటు మాస్క్ ధరించేలా చర్యలు చేపట్టారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని ప్రయాణికులందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని నగర ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు కోరారు. కరోనా నేపథ్యంలో డ్రైవర్లు, కండక్టర్లు ధైర్యంతో విధులు నిర్వహిస్తున్నారని.. ముఖ్యంగా మహిళా కండక్టర్లు ఎంతో కష్టపడి విధులకు హాజరవుతున్నారన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రయాణికులను గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చడమే లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పారు.