నాగదోషం పోతుందనే మూఢనమ్మకంతో దారుణం
మోతె, ఏప్రిల్ 15: మూఢనమ్మకాలతో ఓ తల్లి ఆరు నెలల కూతురిని పొట్టన పెట్టుకొన్నది. నాగదోషం పోతుందనే మూఢ విశ్వాసంతో చిన్నారి గొంతు కోసి అత్యంత దారుణంగా హతమార్చింది. ఈ విషాద ఘటన సూర్యాపేట జిల్లా మోతె మం డలం మేకలపాటితండాలో గురువారం చోటుచేసుకున్నది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. మేకలపాటి తండాకు చెందిన కృష్ణను అదేతండాకు చెందిన భారతి రెండేండ్ల క్రితం రెండో వివాహం చేసుకున్నది. దివ్యాంగుడైన కృష్ణ వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి ఆరు నెలల చిన్నారి ఉంది. 3 నెలల క్రితం ఊర్లోకి వచ్చిన ఓ మాంత్రికుడు చిన్నారికి నాగదోషం ఉన్నదని చెప్పడంతో అప్పటినుంచి భారతి ఇంట్లో దేవుడి బొమ్మలు పెట్టి పూజలు చేస్తున్నది. ఈ క్రమంలో చిన్నారికి నాగదోషం పెరిగిందనే అనుమానంతో గురువారం సాయంత్రం భర్త సూర్యాపేటకు వెళ్లగా.. చిన్నారిని ఇంట్లో గొంతు కోసి చంపివేసింది. సూర్యాపేట నుంచి వచ్చిన కృష్ణ.. రక్తపు మడుగులో ఉన్న పాపను చూసి రోదించాడు. మునగాల సీఐ ఆంజనేయులు, మోతె ఎస్సై ప్రవీణ్కుమార్ సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.