నాగిరెడ్డిపేట్, ఏప్రిల్ 7 : మాస్కు ధరించని వారికి సరుకులు విక్రయించవద్దని ఎంపీపీ రాజదాస్ అన్నారు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు, వ్యాపారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాస్కు ధరించిన వారికే సరుకులు విక్రయించాలని సూచించారు. మాస్కు ధరించకుంటే రూ. వెయ్యి నుంచి రూ. 10 వేల వరకు జరిమానా విధించడంతో పాటు కేసులు నమోదు చేస్తామని ఎస్సై రాజయ్య హెచ్చరించారు. సమావేశంలో తహసీల్దార్ సయ్యద్ అహ్మద్, ఎంపీడీవో రఘు, ఎంపీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
లింగంపేట, ఏప్రిల్ 7 : ప్రతి వ్యాపారి మాస్కును తప్పకుండా ధరించాలని తహసీల్దార్ అమీన్సింగ్ అన్నారు. మండల కేంద్రంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. దుకాణాల యజమానులు కొవిడ్ నిబంధనలు పాటించాలని, దుకాణాలకు వినియోగదారులు మాస్కులు ధరించేలా, భౌతిక దూరం పాటించేలా చూడాలన్నారు.
మాస్క్ ధరించకపోతే జరిమానా తప్పదు
ఎల్లారెడ్డి రూరల్, ఏప్రిల్ 7 : సెకండ్ వేవ్లో కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలని, లేకపోతే జరిమానా తప్పవని గిర్దావర్ అహ్మద్ అన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మాస్కులు ధరించకుండా తిరుగుతున్న పలువురికి జరిమానా విధించారు. ఎల్లారెడ్డి పట్టణంలో ప్రతి రోజూ రెవెన్యూ, మున్సిపాలిటీ బృందాల ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తామని, మాస్కులు ధరించని వారికి జరిమానా విధిస్తామని తెలిపారు. మొత్తం 41 మందికి రూ.4,400 జరిమానా విధించామని వెల్లడించారు. కార్యక్రమంలో గిర్దావర్ అహ్మద్తోపాటు మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, పోలీస్ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
బీర్కూర్, ఏప్రిల్ 7 : మండలకేంద్రంలోని కామప్ప చౌరస్తాలో మాస్కులు లేకుండా తిరుగుతున్న వారికి రెవెన్యూ, పోలీసు, పంచాయతీ సిబ్బంది జరిమానా విధించారు. ఒకొక్కరికి రూ. 500 చొప్పున జరిమానా విధించినట్లు తెలిపారు.
పొలీస్ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన..
గాంధారి, ఏప్రిల్ 7: మండల కేంద్రంలో పొలీస్ కళా బృందం సభ్యులు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కొవిడ్ నిబంధనలపై అవగాహన కల్పించారు. అనంతరం మాస్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ మమ్మాయి సంజీవ్, ఎంపీటీసీ తూర్పు రాజు, పొలీస్ కళా బృందం సభ్యులు ప్రభాకర్, సాయిలు, రవి తదితరులు పాల్గొన్నారు.
మాస్కులు ధరించకుంటే వెయ్యి జరిమానా
గాంధారి, ఏప్రిల్ 7 : మాస్కులు ధరించని వారికి వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామని సర్పంచ్ మమ్మాయి సంజీవ్ హెచ్చరించారు. స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నదని, ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలను పాటించాలని సూచించారు.
బాన్సువాడలోని పలు గ్రామాల్లో..
బాన్సువాడ రూరల్, ఏప్రిల్ 7 : మండలంలోని పలు గ్రామాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ శరత్ ఆదేశాల మేరకు సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ప్రతిఒక్కరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, లేకపోతే రూ. వెయ్యి జరిమానా విధిస్తామని తెలిపారు. దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించాలన్నారు.
ఇవీ కూడా చదవండీ…
కరోనాపై 3 నెలల యాక్షన్ ప్లాన్!
భగత్కు టీఎమ్మార్పీఎస్ మద్దతు
సమన్వయంతో సమస్యలు పరిష్కరించుకుందాం